జగిత్యాల, ఆగస్టు 29 : ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. ఇంత క్లిష్ట సమయంలోనూ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుగ్గారం మండలం మద్దునూర్ నుంచి జగిత్యాలకు సుమారు 60 మంది ప్రయాణికులతో వస్తుండగా, డ్రైవర్ లక్ష్మణ్కు గుండెపోటు రాగా, బస్సు వేగాన్ని తగ్గిస్తూ జగిత్యాల-ధర్మపురి హైవే పక్కన ఆపి స్టీరింగ్పైనే కుప్పకూలిపోయాడు.
వెంటనే ప్రయాణికులు, కండక్టర్ 108కు ఫోన్ చేయగా, స్పందన రాక స్థానికుల సహాయంతో ఆటోలో జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఆరోగ్యం బాగాలేదని, మరో 2 రోజుల్లో రిటైర్ అవుతున్న ఆయనకు బలవంతంగా డ్యూటీ వేశారని లక్ష్మణ్ బంధువులు వాపోయారు. లక్ష్మణ్ ముందు చూపుతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.