న్యూఢిల్లీ, నవంబర్ 19: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు పార్లమెంటులో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. చట్టం చేయడానికి రాజ్యాంగం ప్రకారం ఏ ప్రక్రియ అవసరమో ఉపసంహరణకూ అదే ప్రక్రియ అవసరమవుతుందని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా వెల్లడించారు. మూడు చట్టాల ఉపసంహరణకు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి వేరే మార్గమంటూ లేదని లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొంది, రాష్ట్రపతి అధికార ముద్ర వేసుకున్నందువల్ల వాటిని వెనుకకు తీసుకునే అధికారం పార్లమెంటుకే ఉంటుందని మల్హోత్రా చెప్పారు.
రైతులు తాము పండించే పంటను ముందుగానే నిర్ణీత ధరకు విక్రయిస్తూ.. ప్రైవేటు సంస్థలు , వ్యక్తులతో ఒప్పందం చేసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నది.
అన్నదాతలు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే (మండీలు) కాకుండా దేశంలో ఎక్కడైనా విక్రయించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాల ద్వారా రైతులకు మంచి ధర కల్పించడమే దీని ఉద్దేశమని కేంద్రం చెప్పింది. ఈ చట్టం ప్రకారం రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఎలాంటి పన్ను, రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు, ఇతర అసాధారణ పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో నిత్యావసర సరుకుల జాబితా నుంచి తృణధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు వంటి వాటిని తొలగించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నది. అలాగే వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తేసేందుకు ఈ చట్టం అనుమతిస్తున్నది.