భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దేశ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. తారా ఖరాకువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పలువురు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినదించారు. పది మంది నినాదాలు చేసినట్లు గుర్తించగా.. ఈ కేసులో నలుగురి పోలీసులు అరెస్టు చేశారు. వారిపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఊరేగింపులు, ర్యాలీలను అధికారులు నిషేధించారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పలువురు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది యువకులు మొహర్రం గుర్రాన్ని ఊరేగించేందుకు యత్నిస్తుండగా.. ఇందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు ‘పాక్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పది మందిని గుర్తించి, వారిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ సత్యేంద్రకుమార్ శుక్లా పేర్కొన్నారు. మిగతా వారిని సైతం త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. ఘటనపై సీఎం శివరాజ్ చౌహాన్ స్పందించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.