న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 24, 711 మంది దుర్మరణం చెందారు. తమిళనాడులో 16,685 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. తమిళనాడు, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహిళలపై నేరాలు 2020తో పోలిస్తే 2021లో 15.3 శాతం పెరిగాయి. అలాగే చిన్నారులపై నేరాలు కూడా 16.2 శాతం పెరిగినట్టు నివేదికలో తేలింది.
మహిళలకు సురక్షితంకాని నగరంగా ఢిల్లీ
మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితంకాని మెట్రోపాలిటన్ నగరంగా ఢిల్లీ నిలిచింది. కిందటేడాది నగరంలో సగటున రోజూ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడి జరిగింది. ఈ మేరకు ఎన్సీఆర్బీ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 2021లో ఢిల్లీలో మహిళలపై 13,892 నేరాలు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా ముంబై (5,543 నేరాలు), బెంగళూరు (3,127 నేరాలు) ఉన్నాయి. మొత్తం 19 మెట్రోనగరాల్లో మహిళల కిడ్నాప్నకు సంబంధించి 8,664 కేసులు నమోదుకాగా, ఒక్క ఢిల్లీలోనే 3,948 కేసులు రికార్డయ్యాయి.