అక్టోబర్ 31 నుంచి ఇంగ్లాండ్లోని గ్లాస్గోలో పర్యావరణ పరిణామాలపై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనే 15 మంది భారతీయ ప్రతినిధుల బృందానికి పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ అదనపు కార్యదర్శి రిచా శర్మ నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు కనీవినీ ఎరగని రీతిలో పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూగోళం వేడెక్కుతోంది. ఈ భూతాపంపై అభివృద్ధి చెందిన దేశాల ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికి రిచా శర్మ నాయకత్వంలో భారత్ బృందం సిద్ధమైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రిచా ఛత్తీస్గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈ రెండేండ్లలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా), ఎస్సీవో (షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్), జి-20 సమావేశాల్లో కూడా ఆమె భారత్ తరఫున వాదనలు వినిపించారు. ‘మరీ కఠినంగా ఉండకుండా, పని ఎలా పూర్తిచేయాలో బాగా తెలిసిన మనిషి తను’ అని కితాబు ఇస్తారు ఆత్మీయులు. ప్రత్యర్థులను ఇరుకునపెట్టే వాక్చాతుర్యం రిచా సొంతం. దౌత్యం విషయానికి వస్తే కొన్నిటిలో గెలిస్తే, మరికొన్నిటిలో ఓడిపోతాం. అయినా పోరాటం సాగించాల్సిందే.