న్యూఢిల్లీ, జూన్ 24: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేదిక జొమాటో లిమిటెడ్.. గ్రోఫర్స్ (బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా బ్లింకిట్ బ్రాండ్)ను సొంతం చేసుకోబోతున్నది. ఈ డీల్ విలువ రూ.4,447 కోట్లుగా ఉన్నట్టు శుక్రవారం జొమాటో తెలిపింది. క్విక్ కామర్స్ బిజినెస్లో వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగానే ఈ షేర్ల మార్పిడి ఒప్పందాన్ని చేసుకున్నట్టు వివరించింది.
కాగా, ఈ లావాదేవీకి తమ సంస్థ బోర్డు అమోదం తెలిపిందని జొమాటో వెల్లడించింది. ఇక ఈ డీల్లో భాగంగా ఒక్కో ఈక్విటీ షేర్ను రూ.13.45 లక్షల చొప్పున మొత్తం 33,018 వరకు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్టు జొమాటో స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఇదిలావుంటే హెచ్వోటీపీఎల్ అనే వ్యాపారాన్నీ ఈ డీల్ కింద జొమాటో దక్కించుకోనున్నది.