న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆరుగురికి కీర్తిచక్ర, 15 మందికి శౌర్యచక్ర, 412 మందికి గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. అశోక్ చక్ర తర్వాత రెండో అత్యున్నత పీస్టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తిచక్ర. మూడో అత్యున్నత పీస్టైమ్ గ్యాలంటరీ అవార్డు శౌర్యచక్ర. కీర్తిచక్ర అవార్డు విజేతల్లో డోగ్రా రెజిమెంట్కు చెందిన మేజర్ సుభాంగ్, రాజ్పుత్ రెజిమెంట్ నుంచి నాయక్ జితేంద్ర సింగ్ ఉన్నారు. ఇక మరణానంతరం ఈ అవార్డు పొందిన వారిలో జమ్ముకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రోహిత్కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ భరద్వాజ్, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ్, శ్రావణ్ కశ్యప్ ఉన్నారు. సుభాంగ్, జితేంద్ర సింగ్ తమ టీమ్లతో కలిసి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లలను విజయవంతంగా నిర్వహించారు.
శౌర్యచక్ర పురస్కారానికి ఎంపికైన వారిలో మేజర్ ఆదిత్య భదౌరియా, కెప్టెన్ అరుణ్కుమార్, కెప్టెన్ యుద్ధ్వీర్ సింగ్, కెప్టెన్ టీఆర్ రాకేశ్, నాయక్ జస్బీర్ సింగ్ (మరణానంతరం), లాన్స్నాయక్ వికాస్ చౌదురి, ముదాసిర్ అహ్మద్ షేక్(మరణానంతరం), గ్రూప్ కెప్టెన్ యోగేశ్వర్ క్రిష్టారావ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ తేజ్పాల్, స్కాడ్రన్ లీడర్ సందీప్కుమార్ జజారియా, ఐఏఎఫ్ గార్డ్ ఆనంద్ సింగ్, ఐఏఎఫ్(సెక్యూరిటీ) సునీల్కుమార్తో పాటు కేంద్ర హోంశాఖ నుంచి సత్యేంద్ర సింగ్, విక్కీకుమార్ పాండే, విజయ్ ఒరాన్ ఉన్నారు. కేంద్రం ప్రకటించిన గ్యాలంటరీ అవార్డుల్లో బార్ టు సేన మెడల్ ఒకటి, 92 సేన మెడళ్లు, ఏడు వాయుసేన, 29 పరమ్ విశిష్ట్ సేవా పతకాలు ఉన్నాయి. పలు విభాగాల్లో అవార్డులు ప్రకటించారు.