కీవ్, మార్చి 4: ఐరోపా ఖండంలోనే అతి పెద్దదైన, ఉక్రెయిన్లో విద్యుత్తు సరఫరాకు అత్యంత కీలకమైన జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రాన్ని రష్యా తన అధీనంలోకి తీసుకొన్నది. అంతకుముందు న్యూక్లియర్ ప్లాంటుపై బాంబు దాడులు జరిపింది. జపోరిజియాపై దాడుల వార్తలతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. 1986 నాటి చెర్నోబిల్ విషాదం అందరి మనసుల్లో మెదిలింది. మరో మానవ విధ్వంసం తప్పకపోవచ్చని తీవ్ర భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే ప్లాంటులో రియాక్టర్లకేమీ కాలేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ప్రకటించడంతో ప్రపంచం ఊపిరిపీల్చుకొన్నది. ‘రష్యా బలగాలు దాడి చేసిన భవనం అణురియాక్టర్లు ఉన్నది కాదు. అది ఒక శిక్షణ కేంద్రం. రియాక్టర్లకు ఏమీ కాలేదు. జపోరిజియాలో న్లూక్లియర్ రేడియేషన్లో ఎలాంటి మార్పులు లేవు’ అని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రొస్సి వెల్లడించారు. దాడి జరిగిందని భావించిన రియాక్టర్ ప్రస్తుతం పనిచేయడం లేదని పేర్కొన్నారు. జపోరిజియా ప్లాంటులో ఉన్న ఆరు రియాక్టర్లలో ఒక్కటే పనిచేస్తున్నదని తెలిపారు. పవర్ ప్లాంట్ దగ్గర కాల్పుల్లో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. జపోరిజియాపై దాడి నేపథ్యంలో రష్యా తీరును ప్రపంచదేశాలన్నీ ఖండించాయి. పుతిన్ మొత్తం ప్రపంచ భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించాయి. చెర్నోబిల్ విపత్తును పునరావృతం చేసేందుకు మాస్కో ప్రయత్నిస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. పుతిన్ నిర్లక్ష్య ధోరణి.. ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అసహనం వ్యక్తం చేశారు. కాగా ఉక్రెయిన్ అణువిద్యుత్తు ప్లాంట్లపై ఆధారపడి ఉన్నది. ఇక్కడ నాలుగు ప్లాంట్లలో 15 రియాక్టర్లు ఉన్నాయి. సగం దేశానికి కరెంటు వీటి నుంచే సరఫరా అవుతున్నది. ఒక్క జపోరిజియా నుంచే 20% విద్యుత్తు సరఫరా జరుగుతుంది. అందుకే రష్యా కూడా న్యూక్లియర్ ప్లాంట్లపై దృష్టి పెట్టి మొన్న చెర్నోబిల్ను తాజాగా జపోరిజియాను స్వాధీనం చేసుకొన్నది.
జపోరిజియా పవర్ ప్లాంటు స్వాధీనంతో రష్యా తన ఆక్రమణ పర్వంలో ఒక దశను విజయవంతంగా పూర్తి చేసినైట్టెంది. భౌగోళికంగా ఉక్రెయిన్లో ఒక భాగాన్ని పూర్తిగా వశపర్చుకొన్నది. తూర్పు ఉక్రెయిన్లో నీపహ్ నది చాలా కీలకమైనది. ఇది దేశాన్ని రెండుగా విభజిస్తున్నది. ఈ రెండు భాగాల మధ్య వారధిలా ఉన్నది జపోరిజియా పవర్ ప్లాంటు మాత్రమే. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ నుంచి తూర్పు భాగాన్ని పూర్తిగా వేరు చేసింది. ఉక్రెయిన్ నియంత్రణ నుంచి తప్పించింది.
చెర్నోబిల్తో పోలిస్తే జపోరిజియాది భిన్నమైన డిజైన్. మంటలు అంటుకొన్నా నష్టం జరక్కుండా రియాక్టర్లను నిర్మించారు. ‘రియాక్టర్ల చుట్టూ డోమ్ లాంటి నిర్మాణాలున్నాయి. మంటల నుంచి రియాక్టర్లకు రక్షణ కల్పిస్తాయి’ అని ఒబామా హయాంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సీనియర్ డైరెక్టర్గా పనిచేసిన జాన్ వూల్ఫ్షాల్ అన్నారు. అయినప్పటికీ ఇలాంటి ప్లాంట్లపై దాడులు ప్రపంచానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘బాంబు దాడులతో ఒక వేళ ప్లాంటుకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతే కూలింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది. డీజిల్ జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఇవి అంతగా ప్రభావవంతమైనవి కావు. కూలింగ్ సిస్టమ్ పాడైతే రియాక్టర్లు కరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా పెద్ద విధ్వంసం తప్పదు’ అని వూల్ఫ్షాల్ తెలిపారు. 2011లో జపాన్లో సునామీ సంభవించినప్పుడు ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రంలో కూలింగ్ వ్యవస్థ దెబ్బతినడం వల్లే ప్రమాదం సంభవించిందని గుర్తు చేశారు.