ఎక్కడ మంచి సినిమా ఉన్నా, ఏ భాషలో ప్రతిభ గల హీరోలు ఉన్నా ..స్వాగతించడానికి తెలుగు సినిమా తలుపులు తెరిచే ఉంటాయి. కొత్తదనంతో ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు ఇక్కడ అవకాశాలు అపారం. ఈ వీలును తమిళ, కన్నడ, మలయాళ హీరోలు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ దేశంలో ఏ ప్రధాన భాషలో సినిమా విడుదలైనా అది తెలుగులోకి అనువాదం కావాల్సిందే. ‘బిచ్చగాడు’, ‘కేజీఎఫ్’ లాంటి కొన్ని చిత్రాలైతే ఆ సినిమా సొంత రాష్ర్టాలతో పోటీ పడి తెలుగులో వసూళ్లు సాధించాయి. ఈ మార్కెట్ను ఇన్నాళ్లూ అనువాద చిత్రాలతో అందుకున్న తమిళ హీరోలు ఇక నేరుగా రంగంలోకి దిగారు. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు.
కోలీవుడ్లో కింద స్థాయి నుంచి స్టార్గా ఎదిగారు ధనుష్. ఆయన పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూ విభిన్నమైన చిత్రాలు చేశారు. స్టార్ అయ్యాక ఆ ఇమేజ్ కు తగిన సినిమాల్లో నటిస్తున్నారు. సహజత్వం ఉండే సినిమాలు చేస్తాడనే పేరు ధనుష్కు ఉంది. ఆయన నటించిన దాదాపు ప్రతి సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది. వాటిలో ‘రఘువరన్ బీటెక్’ లాంటి చిత్రాలు విజయాలు సాధించాయి. ఈ క్రేజ్తో ధనుష్తో ‘సార్’ అనే మూవీని నేరుగా తెలుగులో రూపొందిస్తున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ‘సార్’ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్నదని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొంటున్నది. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ధనుష్ తో నేరుగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో కె నారాయణదాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందీ చిత్రం.
తమిళనాట నలుగురు పెద్ద హీరోల్లో ఒకరు విజయ్. ఆయన సినిమాలు దక్షిణాది అంతటా విడుదలవుతుంటాయి. విజయ్ ప్రతి సినిమా తెలుగులో అనువాదంగా వస్తుంటుంది. ఆయన ‘మాస్టర్’, ‘విజిల్’ లాంటి చిత్రాలు ఇక్కడా ఆదరణ పొందాయి. ఇక ఈ స్టార్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. ‘ఊపిరి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు విజయ్ సినిమాతో మరోసారి కోలీవుడ్ను ఆయన పలకరించబోతున్నారు. ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ఇరు చిత్ర పరిశ్రమలను మరింత దగ్గర చేయబోతోంది. ఏప్రిల్ మొదటి వారంలో విజయ్, వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్లో ప్రత్యేక సెట్ను నిర్మించారు.
‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రేక్షకులను బాగా నవ్వించి ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనుదీప్ కేవీ. ప్రతిభావంతుడైన ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయన్తో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నారు. నాయికగా ఉక్రెయిన్ తార మరియా ర్యాబోషప్క ఎంపికైంది. లండన్, పాండిచ్చేరి ప్రాంతాల నేపథ్యంతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనుందీ సినిమా. శివ కార్తికేయన్ గత సినిమా ‘వరుణ్ డాక్టర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ కోలీవుడ్ యువ హీరోకు తెలుగులో మార్కెట్ ఏర్పడింది.
సూర్య ఇటీవలి సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు) ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు బోయపాటి శ్రీను..సూర్యతో నేరుగా సినిమా చేస్తాననే కోరికను వెల్లడించారు. ఇందుకు సూర్య కూడా అంగీకారం తెలిపారు. తెలుగు దర్శకులతో నేరుగా సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఈ తమిళ స్టార్ చెప్పారు. ఈ కాంబోలో వెంటనే కాకున్నా ఎప్పుడో ఒకప్పుడు సినిమా రావడం ఖాయంగానే కనిపిస్తున్నది. సూర్య సోదరుడు కార్తీ ‘ఊపిరి’ చిత్రంలో హీరోగా నటించారు. అతను కూడా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
తమిళ హీరోలు తెలుగులో నటిస్తుంటే…తెలుగు హీరోలూ తమిళ మార్కెట్ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్…ఇలా మన స్టార్స్ చిత్రాలు తమిళనాట కొన్నిచోట్ల నేరుగా, మరికొన్ని చోట్ల డబ్బింగ్ల రూపంలో విడుదలవుతూ మంచి రెవెన్యూ సాధిస్తున్నాయి. మన హీరోలు కూడా నేరుగా తమిళంలో నటించడం ప్రారంభించారు. దర్శకుడు లింగుస్వామితో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘ద వారియర్’లో హీరో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో హీరో శర్వానంద్ కూడా తమిళ ప్రేక్షకులకు పరిచితుడే. ఆయన కొత్త సినిమా ‘ఒకే ఒక జీవితం’తమిళంలోనూ చిత్రీకరణ జరుపుకొంటోంది. ‘కణం’ పేరుతో తమిళనాట ఈ సినిమా విడుదల కానుంది.