Nominations | ఎన్నికల అధ్యాయంలో నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలవుతున్నది. క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్. నామినేషన్ దాఖలు చేయడానికి సుముహూర్తం ఎప్పుడు అని ఆరాలు తీయడం మొదలైంది. కొందరు ఇప్పటికే శుభ ముహూర్తం నిశ్చయించుకోగా, మరికొందరు పురోహితుల దగ్గరికి క్యూ కడుతున్నారు. ముహూర్త బలంతో ప్రత్యర్థి చిత్తవ్వాలని, రికార్డు మెజారిటీ సిద్ధించాలని కోరుతూ బలమైన యోగంతో కూడుకున్న ముహూర్తం ఖరారు చేయాల్సిందిగా పండితులను ఆశ్రయిస్తున్నారు.
ఎవరి సెంటిమెంట్లు వారివి. ఎవరి అదృష్టం వారిది! ఎన్నికల సమరంలో ఓటరు కన్నా ముందుగా నాయకుణ్ని అనుగ్రహించాల్సింది పురోహితుడే! ఆయన గట్టి ముహూర్తం చూస్తే సగం విజయం సాధ్యమైనట్టే అని బలంగా నమ్ముతారు కొందరు నాయకులు. బీ ఫామ్ అందుకోవడం మొదలుకొని నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభ ఘడియలు చూసుకోవడం రివాజు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ దాఖలుకు తమ జన్మ నక్షత్రానికి సరిపడే శుభ ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు.
తిథి.. వారం.. నక్షత్రం..
ఎన్నికల కమిషన్ ప్రణాళిక ప్రకారం ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వానికి తెర లేవనున్నది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది. ఈ ఎనిమిది రోజుల్లో అందరికీ అన్నీ బాగుంటాయి అనుకుంటే పొరపాటే. తిథి బాగుంటే నక్షత్రం కుదరకపోవచ్చు. నక్షత్రం క్షేమకరమైనది అయినా.. వారం కుదరకపోవచ్చు. తిథి, వారాలు కుదిరినా.. యోగం సరిపడేది ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో బలమైన ముహూర్తం చూసే పండితులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకునే పనిలో అభ్యర్థుల అనుచరులు బిజీగా ఉన్నారు. పక్కరాష్ర్టాల జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈసారి అభ్యర్థుల అదృష్టం బాగుండటంతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో సుముహూర్తాలు దండిగా ఉన్నాయి. సాధారణంగా ఆషాడం, భాద్రపదం, పుష్య మాసాల్లో ఎన్నికలు తటస్థిస్తే ముహూర్తాలకు కరువొచ్చి పడేది. నామినేషన్ దాఖలుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులో ఆశ్వయుజ మాసం ఉండటంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నెలలో పెండ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగానే ఉండటంతో… తమ నామినేషన్ వేసే శుభ సమయానికి ఢోకా ఉండదని అభ్యర్థుల నమ్మకం.
ఎనిమిది రోజుల్లో..
నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే మూడో తేదీన ఆశ్వయుజ బహుళ షష్ఠి ఉంది. వారం విశేషంగా ఉన్నా.. తిథి ఓ మోస్తరుగా ఉండటంతో ఆ రోజు నామినేషన్లు తక్కువగా నమోదు కావొచ్చు. 4వ తేదీ బలంగా ఉంది. సప్తమి తిథి, శనివారం, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో ఆ రోజు రిటర్నింగ్ అధికారులకు పని ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. 5, 6 తేదీలు అష్టమి, నవమి తిథులు. వీటికి పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు. ఏడో తేదీ మంగళవారం కావడంతో ప్రత్యేక ముహూర్తాలు పెట్టుకున్న వాళ్లు మినహా నామినేషన్ దాఖలు చేసే ధైర్యం సామాన్యంగా ఎవరూ చేయరు. ఎనిమిదో తేదీ తిథి, వారం బాగున్నా.. పూర్వఫల్గుణి నక్షత్రం ఉండటంతో ఆ రోజూ అంతంతమాత్రమే అంటున్నారు పండితులు. తొమ్మిదో తేదీ గురువారం ఏకాదశి కావడం, రాజకీయ కారకుడైన రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం ఉండటంతో ఆ రోజు నామినేషన్ దాఖలుకు సరైనదని పండితులు విశ్లేషిస్తున్నారు. తొమ్మిది సంఖ్య కూడా అదనపు బలాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు. చివరి రోజు కూడా హస్త నక్షత్రం ఉండటంతో ఆ రోజు కూడా నామినేషన్లు దండిగానే నమోదవుతాయని అంటున్నారు పండితులు.
తారాబలం ప్రధానం
ఏ పని చేసినా తారాబలం ప్రధానం అంటారు పెద్దలు. నామినేషన్ దాఖలుకు కూడా ముందుగా కలవాల్సింది అదే! రాజకీయం, వివాహం, ఉద్యోగం తదితర విషయాల్లో తారాబలం కలిస్తేనే జయం కలుగుతుందని పండితుల ఉవాచ. ఏ దోషాలూ లేని ముహూర్తాలు కుదరడం అరుదు. అయితే, చిన్నాచితకా దోషాలున్నా.. చట్టంలో సవరణలు ఉన్నట్టు.. తారాబలం ప్రశస్తంగా ఉంటే పనికొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.
… కడార్ల కిరణ్