హైదరాబాద్ : రైతు బీమా వంటి పథకం భూ మండలంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు బీమా వంటి పథకం ఈ భూమండలంలో లేదన్నారు. నిరుపేదలు లబ్ది చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రైతు బీమా వ్యవసాయ కుటుంబాలకు ధీమా అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 45 వేల మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందజేసినట్లు చెప్పారు. సామాజిక బాధ్యతగా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఏ బీమాకయినా దాని వినియోగదారుడే బీమా సొమ్ము చెల్లిస్తాడు. కానీ రైతుల తరపున తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పథకం అమలుచేస్తుందన్నారు.
రైతు బీమాను కౌలు దారులకు వర్తింపజేయాలన్న దానిపై చర్చ జరగాల్సి ఉందని తెలిపిన మంత్రి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీలయినంత ఎక్కువ మందికి లబ్దిచేకూరేలా చూస్తామన్నారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారి రైతుబంధు అమలులో ఇబ్బందులు. రూ.27 కోట్లు వెనక్కి వచ్చాయి. వాటిని త్వరలోనే ఆయా రైతుల ఖాతాలలో తిరిగి జమచేయనున్నట్లు పేర్కొన్నారు.