తిరుమల : ఈ నెల 7వ తేదీ నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 6న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. గురువారం ధ్వజారోహణం కారణంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ క్రమంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.