కోటగిరి, మార్చి 21: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పొతంగల్-మహారాష్ట్ర సరిహద్దులో కరోనా టెస్టుల కోసం చెక్పోస్టును ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొతంగల్ పీహెచ్సీ సూపర్వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులకు నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టెస్టులు చేస్తామని చెప్పారు. అంతకు ముందు ఆమె పొతంగల్ పీహెచ్సీలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ మరో సారి విజృంభిస్తున్నదని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు.
వర్నిలో కరోనా టెస్టులు..
వర్ని, మార్చి 21: మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో ఆదివారం ఆరుగురికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మండలంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నలుగురికి కరోనా పాజిటివ్
ఆర్మూర్, మార్చి 21: పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ దవాఖానలో ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నాగరాజు, సూపర్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. 32 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులను ధరించాలన్నారు.