హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకొన్న తెలంగాణ మరోసారి శభాష్ అనిపించుకొన్నది. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హోమ్ ఐసొలేషన్ ట్రీట్మెంట్ అండ్ మానిటరింగ్ (హితమ్) ప్రొటోకాల్ నెట్వర్క్ ఉత్తమ ఆవిష్కరణ అని నీతిఆయోగ్ కొనియాడింది. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేసులను తగ్గించేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు హితమ్ పేరిట ప్రొటోకాల్ను తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇంటింటి జ్వరసర్వేను నిర్వహించింది. మెడికల్ కిట్లు, టెలికాలర్ సేవలను అందించింది. కరోనా రోగులు హోమ్ ఐసొలేషన్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. నీతిఆయోగ్ ప్రశంసలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన సారథ్యం వల్లే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ ఎన్నో గొప్ప ప్రశంసలు పొందుతున్నదని ట్వీట్ చేశారు.