ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
ఈ భయానక వాతావరణంలో ఒక్క ఐరోపానే కాకుండా ప్రపంచ దేశాలకు యుద్ధ భీతిని కలిగిస్తుంది.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి సైతం ఈ యుద్ధాన్ని నిలుపు చేయడంలో దాని పాత్ర ప్రశ్నార్థకంగా మారడం ప్రపంచ శాంతికి పెనుసవాలుగా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి పూర్వాపరాలను ‘నిపుణ’ పాఠకుల కోసం అందిస్తున్నాం.
గతంలో..
రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1949లో అమెరికా నేతృత్వంలో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) ఏర్పడింది. దాని సభ్యదేశాల్లో ఏ ఒక్క దానిపై ఇతర రాజ్యాలు దాడి చేసినా మిగిలినవన్నీ కలిసి ఎదుర్కోవాలనే మౌలిక సూత్రం ఆధారంగా అది రూపుదిద్దుకుంది.
నాటోకు పోటీగా సోవియట్ యూనియన్ తూర్పు ఐరోపా దేశాలతో వార్సా సైనిక కూటమి ఏర్పరిచింది. 1991లో సోవియట్ విచ్ఛిన్నం అయి 15 స్వతంత్ర దేశాలుగా విడిపోయాక వార్సా కూటమి చెల్లాచెదురైంది.
అమెరికా నాటో దేశాలు క్రమంగా తమ బలాన్ని పెంచుకున్నాయి. అంతటితో ఆగకుండా ప్రస్తుత రష్యా సరిహద్దు దేశాలైన ఉక్రెయిన్, మిగతా దేశాలను నాటో భాగస్వాములుగా అమెరికా, దాని మిత్రదేశాలు చేర్చుకోవడానికి ప్రయత్నించడం రష్యాకు మింగుడుపడని విషయంగా తయారైంది. ఆ ప్రయత్నాలనే పుతిన్ ప్రస్తుతం గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
2014 నుంచి మొదలు
2014లో నల్ల సముద్రంలో ఉన్న క్రిమియా ద్వీపకల్పంను రష్యా విలీనం చేసుకుంది. అదే సమయంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన డాన్బాస్లోని డొనెస్క్, లూహన్స్క్ వేర్పాటువాదాన్ని మాస్కో ప్రోత్సహించింది. 2015లో హింసకు ముగింపుగా బెలారస్ రాజదాని మిన్స్క్లో ఉక్రెయిన్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు.
ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్, రష్యాలు వేర్వేరుగా అన్వయించుకోవడం వల్ల సమస్య మరింత జఠిలమైంది. ఆ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని మాస్కో డిమాండ్ చేస్తుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం కొన్ని నామమాత్రపు అధికారాలు కేటాయించి, తిరిగి డాన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించడానికి ప్రయత్నం చేసింది.
మరో వైపు ఉత్తర క్రిమియా కాలువకు నీటి సరఫరాను ఉక్రెయిన్ తొక్కిపట్టడం మాస్కోకు ఆగ్రహం కలిగించింది. 2014 తర్వాత నీటి సరఫరాలో ఉక్రెయిన్ సమస్యలు సృష్టించడంతో క్రిమియాలో కరువు పరిస్థితి నెలకొంది.
దీనికి ప్రతిస్పందనగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని తిరుగుబాటుదారులను బలోపేతం చేసి రష్యా ప్రభావాన్ని మరింత చాటుకోవడానికి మాస్కో కంకణం కట్టుకుంది. ఈ విధంగా నాటో, అమెరికాలను అడ్డుకోవడం, ఉక్రెయిన్ను కట్టడి చేయడం మాస్కో ప్రధాన లక్షాణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో 2021 డిసెంబర్లో బైడెన్తో జరిగిన భేటీలో పుతిన్ డిమాండ్లు తూర్పు ఐరోపాలో నాటో కార్యకలాపాలను నిలిపివేసి 1997 నాటి స్థితికి నాటో వెళ్లాలని కోరడం, పోలెండ్, రొమేనియాలో మొహరించిన క్షిపణులను తొలగించాలని కోరడం పుతిన్ ప్రథమ లక్ష్యాలుగా మారాయి.
మాస్కో మరింత ముందుకు ఆలోచించి డాన్బాస్ ప్రాంతంలోని దాదాపు 7 లక్షల మందికి రష్యా పాస్పోర్టులు ఇచ్చింది. అంతేకాకుండా తిరుగుబాటుదారుల ఆక్రమణలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలనే బిల్లును రష్యా చట్టసభ ‘డుమా’ ముందుకు తీసుకువచ్చింది.
జాతీయవాదం
ఉక్రెయిన్పై మాస్కో దండెత్తడం పుతిన్ జాతీయవాద ఎజెండాలో భాగమే. 4 కోట్లకుపైగా జనాభా కలిగిన ఉక్రెయిన్ ప్రజల స్థితిగతులను 14 కోట్ల జనాభా కలిగిన రష్యన్ ప్రజల భవిష్యత్తును పుతిన్ జాతీయవాదం ప్రశ్నార్థకంగా మార్చింది.
అమెరికాకు చేరువలో ఉన్న క్యూబాలో క్షిపణి అంశంలో అమెరికా భయపడి సోవియట్ను హెచ్చరించడం, ఇప్పుడు రష్యాకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్ నాటో సభ్యత్వానికి ప్రయత్నించడం, దీనికి ప్రతిస్పందనగా రష్యా యుద్ధాన్ని ఆకాంక్షించడం జరిగింది. 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభానికి జవాబుగా నేటి రష్యన్ యుద్ధ కాంక్ష జవాబు వంటిదని రష్యన్ మద్దతు రాజకీయ విశ్లేషకుల వాదన.
ప్రస్తుతం నాటో విస్తరణ మాస్కోను అధికంగా భయపెడుతుంది. అటు ఐరోపా సమాఖ్యతో, ఇటు రష్యాతో సరిహద్దు పంచుకొనే ఉక్రెయిన్ నాటోలో చేరితే భవిష్యత్లో క్రిమియాను సైతం చేజార్చుకోవాల్సి వస్తుందని పుతిన్ భయం.
పూర్వ వార్సా కూటమి దేశాలైన పోలెండ్, రొమేనియా, హంగేరి, చెక్రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియాలు నేడు నాటో కూటమిలో చేరాయి. వీటి పరంపరగా ఉక్రెయిన్ సైతం నాటోలో భాగమైతే మాస్కో మరింత బలహీనపడటంలో ఇది ప్రధాన అంశంగా నిలవగలదు.
యుద్ధ క్రమంలో..
చివరి నిమిషంలో ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడం తప్ప అమెరికా, నాటో ఆ దేశాన్ని రష్యా బారి నుంచి కాపాడలేకపోయాయి. ఉక్రెయిన్ ప్రజలు ఆ దేశాధ్యక్షుడైన జెలెన్స్కీపై అపార సానుభూతి మాత్రమే మిగిలింది. ఐక్యరాజ్యసమితి సైతం రష్యా దూకుడును ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ రకంగా ఐక్యరాజ్య సమితి, నాటో దేశాల బలహీనత బయటపడింది.
దీనినే అలుసుగా తీసుకొని తైవాన్ను చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించవచ్చునని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు దేశాల విస్తరణ వాదం దీర్ఘకాలంలో ప్రపంచగతిని మార్చివేసే అవకాశం లేకపోలేదు.
ఆర్థిక ఒడిదుడుకులు
కొవిడ్ సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాలకు సాంత్వన కలుగుతుందని భావిస్తున్న క్రమంలో నల్ల సముద్రంపై కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరో ప్రపంచపు యుద్ధానికి దారి తీస్తాయా? ప్రపంచ జన జీవన స్రవంతికి ముప్పు తెచ్చి పెడుతుందా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
రష్యా నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్, చమురు ఐరోపా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. ఐరోపాకి కావల్సిన గ్యాస్లో 40% రష్యా నుంచే సరఫరా అవుతుంది. ఈ విధంగా ఈ యుద్ధ పరిణామం ఐరోపా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. మరోవైపు స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను దూరం చేయడం పుతిన్ అంతరంగికులపై ఆంక్షలు విధించడం ప్రతి స్పందనగా అమెరికా యోచిస్తుంది. ఫ్రాన్స్తో సహా మరిన్ని ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలను విధించడంలో ఆలోచనలో పడ్డాయి. చైనా మాత్రం రష్యాను సమర్థిస్తుండగా, భారత్ తన స్వతంత్ర నిష్పక్షపాత జోక్యరహిత విధానాన్ని సమర్థిస్తూ యుద్ధంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన వీటోకు దూరంగా నిలిచింది.
భారత్ సందిగ్ధత
అమెరికా రష్యాల్లో ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి భారత్కు తలెత్తే అవకాశం ఉంది. అమెరికాతో భారత్ దాదాపు 14,500 కోట్ల డాలర్లకుపైగా వ్యాపారం సాగిస్తుంది. మరోవైపు మాస్కో నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది. ఇటీవల కాలంలో మాస్కో నుంచి ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోళ్లపై అమెరికా, కాట్సా ఆంక్షలు ప్రయోగించే ముప్పు కలిగి ఉంది.
గత చరిత్రపరంగా భారత్కు రష్యా మిత్రదేశం, ఆపదలో ఆదుకున్న దీనబంధు కాగా అమెరికా మాత్రం అవసరాల దృష్ట్యా భారత్తో వ్యవహరించిన తీరు జగత్ విదితం.
21వ శతాబ్దపు మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా వాస్తవ విదేశాంగ విధానం దృష్ట్యా అమెరికాతో భారత్ బలపడటం మాస్కోకు దూరంగా ఉండటం గమనించిన రష్యా ఇటీవల కాలంలో పుతిన్ కొవిడ్ అనంతరం తన విదేశీ పర్యటనలో భాగంగా భారత్ను ఎంచుకోవడం వాణిజ్య విలువను పెంచడం, సాంకేతిక రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఇతర రంగాల్లో కుదిరిన ఒప్పందం ఒకవైపు, అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలు మరోవైపు శాంతికాముక విధానాన్ని కోరే దేశంగా యుద్ధం వ్యతిరేక విధానం జోక్య రహితం. అంతర్జాతీయ శాంతి కోరే ముఖ్యదేశంగా భారత్పై ఉక్రెయిన్ రష్యా యుద్ధం భారత్ నిర్ణయీకరణలో పెనుసవాలుగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పూర్వవైభవానికి పుతిన్ ప్రయత్నం
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు దీటుగా ఏర్పడిన దేశం రష్యా పాశ్చాత్య భావాలకు, ఉదారవాద సిద్ధాంతాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం సాధించే క్రమంలో ఒక్క రష్యా మాత్రమే పెట్టుబడిదారుల, ఉదారవాద సిద్ధాంతాలకు ఎదురుగా నిలబడి సామ్యవాదం, ఉమ్మడి ఆస్తి, సమానత్వమే ఆలంబనగా కార్ల్మార్క్స్ స్ఫూర్తితో, లెనిన్ వారసత్వంతో, స్టాలిన్ నాయకత్వంలో రష్యా ప్రపంచ దేశాలకు ఒక ప్రత్యామ్నయంగా నిలిచింది. రెండు దేశాల మధ్య నడిచిన ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ డీలా పడటానికి 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభం వేదికగా మారింది.
క్యూబాలో మోహరించిన అణు క్షిపణులను తొలగించకపోతే అణు యుద్ధం తప్పదని హెచ్చరించిన నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ఎఫ్ కెనడీ సవాలుకు సోవియట్ అధ్యక్షుడు నికితకృశ్చేవ్ వెనుకడుగేశారు. అది లొంగుబాటు తప్ప మరేమీకాదని నాటి క్యూబా అధినేత ఫిడెల్ క్యాస్ట్రో రుసరుసలాడారు.
ఆ తర్వాత జరిగిన అంతర్జాతీయ పరిణామాల్లో భాగంగా సోవియట్ బలగం సన్నగిల్లడం, అమెరికా, దాని మిత్రదేశాలు బలపడటం చివరగా 1991 సంవత్సరంలో సోవియట్ పతనం, రష్యన్ వాసులకు చేదు అనుభవంగా మిగిలింది. ఈ విధంగా రష్యా పతనస్థితికి అమెరికా, దాని మిత్ర దేశాలు కారణంగా చూపి నాటోను తమ బలమైన శత్రు సైన్యంగా మాస్కో పరిగణిస్తుంది.
21వ శతాబ్దం ప్రారంభంలో రష్యా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్న పుతిన్ తన దీర్ఘకాల ఎజెండాలో పూర్వపు సోవియట్ యూనియన్ గత వైభవాన్ని పునరుద్ధరించడం, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయడం, ప్రపంచంలో అమెరికాకు దీటుగా తమ దేశ ఖ్యాతిని గడించడం వంటి కార్యక్రమాలను పుతిన్ తన సుస్థిర అధ్యక్ష కాలంలో తన కలలుగా నిలిచాయి.
మల్లవరపు బాలలత ,సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్