హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నమోదైన కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మత్తు నాగరాజు, ఏ2గా మేడ్చల్ జిల్లాకు చెందిన కొమ్మరాజుల కనకయ్య, ఏ3గా జనగాం జిల్లాకు చెందిన సుర సారయ్య, ఏ4గా చత్తీస్గఢ్కు చెందిన గొరిల్లా మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా, ఏ5గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొయ్యడ సాంబయ్య, ఏ6గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మదకం కోస్గి, ఏ7గా వరంగల్ అర్భన్ జిల్లాకు చెందిన వల్లెపు స్వామి పేర్లను చార్జిషీట్లో చేర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కుట్రకు సంబంధించి కేసు నమోదైంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఏడాది మే 2న ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసింది. మావోయిస్టు అండర్గ్రౌండ్ సభ్యుల సహకారంతో మావోయిస్టు నాయకులు పెద్ద మొత్తంలో పేలుడుపదార్థాలు సమకూర్చి విధ్వంసానికి పథక రచన చేసినట్టు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.