సికింద్రాబాద్, జనవరి 24: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ ప్రక్షాళన చేసే దిశగా కంటోన్మెంట్ బోర్డు అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా చెత్త సేకరణకు వినియోగిస్తున్న అద్దె వాహనాల స్థానంలో కంటోన్మెంట్ బోర్డు సొంతంగా వాహనాల్ని తీసుకురానుంది.
కార్మికుల పని విభజనలోనూ వినూత్న విధానం..
కార్మికుల పని విభజనలోనూ వినూత్న విధానాన్ని అమలు చేసేందుకు యంత్రాంగం, రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వ్యాప్తంగా తడి, పొడి చెత్త సేకరణ అరకొరగా జరుగుతోంది. దీన్ని వంద శాతానికి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్లో ఐదు సర్కిల్లు ఉండగా మొదటగా బోయిన్పల్లి సర్కిల్లో త్వరలో 15 వాహనాలు చెత్త సేకరణకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మిగతా బొల్లారం, తిరుమలగిరి, బాలంరాయి, కార్ఖానా సర్కిల్లో సైతం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇలా చేస్తే ఫలితం..
ప్రస్తుతం వీధుల్లో రిక్షాల ద్వారా చెత్త సేకరణ జరుగుతోంది. ఒక్కో బండి వద్ద ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నా రు. వీరంతా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి బండిలో నింపి.. తర్వాత టాటాఏఎస్ వాహనంలో తడి, పొడి చెత్తగా వేరు వేసేవారు. నేరుగా టాటాఏఎస్ వాహనం అందుబాటులోకి తెస్తే.. 3 చెత్త రిక్షాలకు సమానమైన పని చేస్తుంది. అంటే సర్కిల్ పరిధిలోని బస్తీలో 3 వాహనాలకు బదులుగా ఒక్క వాహనం తిరిగితే చాలు. వాహనం వెంట కేవలం ఇద్దరు కార్మికులు సరిపోతారు. నలుగురు కార్మికుల్ని ఆ పని నుంచి వేరుచేసి మరో పనికి వినియోగించుకోవచ్చని అధికారుల ఆలోచన. ఫలితంగా తక్కువ మందితో చెత్త సేకరణను పూర్తి చేయచ్చన్నారు.
స్వచ్ఛ కంటోన్మెంట్గా తీర్చిదిద్దాలి..
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చెత్తకుండీలు లేకుండా స్వచ్ఛ కంటోన్మెంట్ దిశగా అడుగులు వేయడం శుభ సూచికం. తొలుతగా బోయిన్పల్లి సర్కిల్లోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలనుకోవడం మంచి పరిణామం. కంటోన్మెంట్ బోర్డు అధికారులు చెత్త సేకరణకు సంబంధించి ముందడుగు వేయడం హర్షణీయం.