పవన్కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. ‘కిందున్న మడుసులకా కోపాలు తెమలవు..పైనున్న సామేమో కిమ్మని పలకడు.. దూకేటి కత్తులా కనికరమెరగవు..అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు’ అంటూ సాగిన ఈ గీతం అడవితల్లి మనోవేదనను అక్షరీకరించింది. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు.
ఆయన మాట్లాడుతూ ‘ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువులాడుకుంటుంటే చూడలేని కన్నతల్లి ఆవేదన ఏమిటన్నదే ఈ పాట సారాంశం. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు అడవితల్లి…ఈ భావనతోనే పాట రాశాను’ అని చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది.