హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఇంగ్లిష్ మీడియంతో పాటు సమాంతర సెక్షన్ల మంజూరులో సంస్కరణలు తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సమగ్ర మార్గదర్శకాలతో పాలసీని రూపొందించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో 2008-09 సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన సాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆంగ్లమాధ్యమ పాఠశాలలు తెరువగా, మరికొన్నింటిలో తెలుగు మీడియానికి సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు 8 వేల స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా, వీటిలో 2,800 హైస్కూళ్లు ఉన్నాయి. ఇవి ఏటేటా పెరుగుతున్నాయి. కొత్త సెక్షన్లను ప్రధానోపాధ్యాయులే ప్రారంభించి, విద్యార్థులను చేర్చకొంటున్నారు. టీచర్ల కొరతను అధిగమించేందుకు విద్యావలంటీర్లను నియమించుకొంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందుతున్నారు.
ప్రతి ఏటా 50 స్కూళ్లు
ఏటా 50కిపైగా ప్రభుత్వ స్కూళ్లు అప్గ్రేడ్ కావడమో, కొత్త సెక్షన్లు ప్రారంభించుకోవడమే జరుగుతున్నది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవలే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎకిన్పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఈ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం సెక్షన్ను గతంలో ప్రారంభించారు. అప్పట్లో పిల్లలు చేరలేదు. ఈ ఏడాది విద్యార్థులు భారీగా చేరారు. టీచర్ల కొరత ఏర్పడటంతో విద్యావలంటీర్లను నియమించుకోవడం, వారికి వేతనాలిచ్చేందుకు స్థానిక దాతలు, తల్లిదండ్రుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయడంతో ఆగ్రహించిన అధికారులు హెచ్ఎంపై చర్య తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ వచ్చిన 50 స్కూళ్ల ప్రతిపాదలను పక్కనబెట్టారు. ఈ ఒక్క ఏడాదికి 10వ తరగతి విద్యార్థులకు అనుమతినిచ్చి, మిగతావి పక్కనపెట్టేశారు. ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు ప్రారంభించేందుకు భవనాలు, వసతులు, టీచర్లు సహా ఇతర మౌలిక వసతులు ఉంటేనే అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు.