గంటి భానుమతి కలం నుంచి జాలువారిన ‘నేల జారిన ముగ్ధత్వం’ కేవలం కథల సంపుటి మాత్రమే కాదు.. కొన్ని వందల జీవితాలను ఒక దగ్గరికి చేర్చి.. అందులో మనకు నచ్చిన జీవితాన్ని ఆచరించమని చెప్పే అనుభవాల సమాహారం. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోతే నేర ప్రవృత్తితో ఎలా పెరుగుతారు? అమాయక యువతుల మాన, ప్రాణాలు ఎలా బలితీసుకుంటారు? అబ్బాయిలను అలా తయారు చేసినందుకు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని శిక్షించాలి? అంటూ హత్యాచారానికి గురైన శ్వేత బాధను, తల్లిదండ్రుల వ్యథను ‘నేల జారిన ముగ్ధత్వం’లో చిత్రించారు రచయిత్రి. సైనికుడిగా సరిహద్దులో పహరా కాస్తూ తల్లికోసం పరితపించే ‘పారిజాతాలు’ కథ తల్లీకొడుకుల ప్రేమకు ప్రతిరూపం. కాగా, ‘నీటిపైన రాతలు’ మలి వయసులో బంధాల బలాన్ని తెలుపుతుంది.
తనను చిన్ననాడే చేరదీసి, తన చదువుకోసం వారి జీవితాలను త్యాగం చేసిన మత్స్యకారుల కోసం రాజు పడే తపన, అతని లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన సమీరా వ్యక్తిత్వాలను ‘అలల పాటలు’లో కళ్లముందు ఉంచారు. తాగుబోతు తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకుండా కూతురు చెమట చుక్కల్ని మద్యంగా సేవిస్తుంటే.. మంచానపడిన తల్లిని కాపాడుతూ.. తమ్ముళ్ల బాగోగులు చూసుకుంటూ.. కుటుంబం కోసం హిందీ హీరోయిన్లకు డూప్గా పనిచేస్తున్న మాధవి జీవితం ‘ఓ ఎక్స్ట్రాకథ’ కన్నీళ్లు పెట్టిస్తుంది. మనసును కదిలిస్తుంది. డబ్బుందనే అహంకారంతో కూతురు ప్రేమను అంగీకరించక.. అవమానించిన తండ్రి కథ ‘ఎదలోపలి మమకారం’ పాఠకుల గుండె లోతులను తడుముతుంది. సర్కస్ చేసుకునే అమ్మాయి కాలు విరిగితే.. కృత్రిమ పాదంతోనే ఇరవై అడుగుల ఎత్తులో సన్నని తీగపై నడిచి.. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని స్ఫూర్తి నింపే ‘స్పందన’ కథ అమోఘం. తన పంజాతో ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా.. ఎందరో పేదల జీవితాలను తలకిందులు చేసింది. బతుకుదెరువు కోసం పట్నం వచ్చి మొదటి లాక్డౌన్లో బతుకుపై ఆశతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఓ భుజంపై బిడ్డలను, మరో భుజంపై బట్టలు పెట్టుకొని వందల మైళ్లు నడిచిన తల్లిదండ్రుల వ్యథలకు అక్షర రూపం ఇస్తూ ‘ఎంత దూరం!’ కథలో కొత్త ఆశల లోకాన్ని పరిచయం చేశారు. మచ్చుకు కొన్ని కథల సారాంశాన్ని మాత్రమే తీసుకున్నా.. అన్ని కథలూ చదవాల్సినవే.
నేల జారిన ముగ్ధత్వం
పేజీలు : 160 , వెల : రూ.150
రచన : గంటి భానుమతి
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు
వివరాలకు : 88976 43009
డప్పు రవి
కొత్త ప్రపంచ ఆవిష్కారం
ప్రపంచంలో మనిషి జీవితంలో వివిధ దశలకు సంబంధించి ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు జంతువులు మనుషుల్లా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలను దాదాపు నలభై ఏండ్ల పాటు శ్రమకు ఓర్చుకొని దిన పత్రికలు, మ్యాగజైన్లు, వివిధ ఇతర ప్రసార మాధ్యమాల నుంచి సేకరించి బహుగ్రంథ కర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ, పురాణాలతో సమన్వయం చేస్తూ ‘జీవుడు దేవుడు’ పుస్తకంగా తీర్చిదిద్దారు. 2018లో ఆయన మరణించడానికి ముందు తన సేకరణలకు అక్షర రూపం ఇచ్చారు.
ఆయన కుమారుడు అశోక్ బాబు పుస్తక రూపంలో తాజాగా వెలుగులోకి తెచ్చారు. ఎన్నో ఆసక్తికరమైన, అసాధారణమైన సంఘటనలను ఉటంకిస్తూ, వాటికి తన అనుభవంలో జరిగిన ఘట్టాలను, తను అధ్యయనం చేసిన విషయాలతో రుజువు చేస్తూ, పాఠకులకు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ సాగిపోయారు ఈ పుస్తకంలో కపిలవాయి లింగమూర్తి. ఇందులో ఆయన వివరించిన విజ్ఞానశాస్త్ర సంబంధమైన, ప్రజల నమ్మకాల్లో నిలిచిపోయిన ఎన్నో ఉదాహరణలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. 90 ఏండ్లకు చేరుకున్న వయసులోనూ సమాజ విజ్ఞాన పరిధిని పెంచాలన్న లింగమూర్తి తపన అభినందనీయం.
జీవుడు దేవుడు
పేజీలు: 156+ 43; వెల: 200
రచన: కపిలవాయి లింగమూర్తి
ప్రచురణ: వాణీ ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు
ఫోన్: 87907 27772
బుక్ షెల్ఫ్ భావ విహంగాలు
(మూలం: విశ్వకవి
రవీంద్రనాథ్ ఠాగూర్- స్ట్రే బర్డ్స్)
పేజీలు: 152
వెల: 150
అనువాదం:
వల్లభుని నిర్మలప్రసాద్ ప్రతులకు: ఫోన్: 9515437012
ఉపాసన (గద్వాలు సంస్థాన చరిత్ర)
పేజీలు: 197
వెల: 200
రచన: కల్లూరు
రాఘవేంద్రరావు
ప్రచురణ: శ్రీకృష్ణ
దేవరాయ గ్రంథమాల
ప్రతులకు:
ఫోన్: 9493271620
అల్మార (కవితల సంపుటి)
పేజీలు: 108
వెల: 100
రచన: దాసరి మోహన్
ప్రతులకు: రచయిత
ఫోన్: 9985309080
నవచేతన బుక్ హౌస్ అన్ని శాఖలు,
తెలంగాణ చైతన్య సాహితి
బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్
పేజీలు: 96
వెల: 90
రచన: రాథోడ్ శ్రావణ్
ప్రచురణ: ఉట్నూరు సాహితీ వేదిక
ప్రతులకు: ఫోన్: 9491467715