న్యూఢిల్లీ: కరోనా కారణంగా మరో పరీక్ష వాయిదాపడింది. నీట్ పీజీ పరీక్షను నాలుగు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. కొవిడ్ చికిత్సల్లో సిబ్బంది కొరత రాకూడదని కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. వంద రోజులు కొవిడ్ విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థులకు కొవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను టెలీకన్సల్టేషన్, స్వల్ప కొవిడ్ లక్షణాలున్న రోగులకు చికిత్స అందించేందుకు వీరి సేవలను ఉపయోగించుకోనున్నారు.
కేంద్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న నీట్ పీజీ పరీక్షలు జరగాల్సి ఉండే. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ పీజీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్థన్ గతంలో ప్రకటించినప్పటికీ.. మరోమారు పరీక్షలను వాయిదావేస్తూ పీఎంవో నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.