రామగిరి, సెప్టెంబర్ 21 : అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ), బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన టీఎస్పీఈసెట్-2022 ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షల్లో సత్తాచాటి సీటు సాధించాలనే సంకల్పంతో ముందుకుసాగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన మహిళా అభ్యర్థులతో ఎంజీయూలో సందడి నెలకొంది. పరీక్షల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి హాజరై ఎంజీయూ వీసీ, పీఈసెట్ చైర్మన్ ప్రొ. చొల్లేటి గోపాల్రెడ్డి, కన్వీనర్ ప్రొ. వడ్డేపల్లి సత్యనారాయణ, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. టి.కృష్ణారావుతో కలిసి బెలూన్స్ ఎగురవేసి జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,340 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎంజీయూ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,996 మందికి 1,276 మంది, ఎంజీయూలో 479 మందికి 287 మంది హాజరయ్యారు. ఉదయం 7:15 గంటలకు ప్రారంభమైన ఈవెంట్స్ మధ్యాహ్నం ముగిశాయి. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
కార్యక్రమంలో ఎంజీయూ ఓఎస్డీ డా॥ అల్వాల రవి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా॥ జి.ఉపేందర్రెడ్డి, ఎంజీయూ అభివృద్ధి అధికారి డా॥ మారం వెంకటరమణారెడ్డి, హాస్టల్స్ డైరెక్టర్ ప్రేమ్సాగర్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా॥ అంజిరెడ్డి, అల్వాల రవి, పీడీలు డా॥ వై.శ్రీనివాస్రెడ్డి, డా॥ ఆర్.మురళి, ఓయూ ప్రొఫెసర్ సునీల్, బేగ్ అహ్మద్, పీఈసెట్ నిర్వహణ కమిటీ సభ్యులు, వలంటీర్లు పాల్గొన్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా..
సెట్కు హాజరైన అభ్యర్థులకు తొలుత ప్రత్యేక కౌంటర్లలో రిజిస్ట్రేషన్స్ చేసి బ్యాచ్ నంబర్స్ ఇచ్చారు. అనంతరం ప్రతి ఒక్కరికీ 100 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్, హైజంప్, లాంగ్జంప్ నిర్వహించారు. వాటిలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఫలితాలు వెల్లడించనున్నారు.
యువత శారీరక దృఢత్వం కలిగి ఉండాలి : ఎమ్మెల్యే నోముల
హాలియా : యువత శారీరక దృఢత్వం కలిగి ఉండాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. బుధవారం మండలంలోని శ్రీనాథపురంలో గల శ్రీకృష్ణ వ్యాయామ కళాశాలలో టీఎస్పీఈసెట్-2022 సామర్థ్య పరీక్షలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, ఎంపీటీసీ కొండా రమేశ్, నాయకులు ఎన్నమల్ల సత్యం, చిలికిరెడ్డి గోపాల్రెడ్డి, ప్రొఫెసర్ సత్యనారాయణ, రాష్ట్ర పరిశీలకుడు కుంభం రాంరెడ్డి, ప్రిన్సిపాల్ నర్సింహారావు, ఏడుకొండల్, శ్రీనివాస్, వెంకట రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హాలియా : శ్రీకృష్ణ బీపీడీ కళాశాలలో శారీరక సామర్థ్య పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్కుమార్
చౌటుప్పల్లో..
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి ఎంఎంఆర్ వ్యాయామ కళాశాలలో పరీక్షలను సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు. పరీక్షలను 15 మంది టెస్టర్లు, 30 మంది వలంటీర్లు పర్యవేక్షించారు.
చౌటుప్పల్ : షాట్ఫుట్ విసురుతున్న విద్యార్థి