పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి వారి భవిష్యత్కు మార్గ నిర్దేశనం చేసేది ఉపాధ్యాయులు.. కానీ ఉపాధ్యాయ వృత్తి కోసం చేసే బీఈడీ విద్య అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అరకొర వసతుల మధ్య అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 33 కాలేజీలు ఉండగా అందులో పదిలోపు మాత్రమే నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. మిగతావన్నీ దూరవిద్యను తలపిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నా యాజమాన్యాలు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. అధ్యాపకులకు జీతాలు కూడా చెల్లించకుండా ‘నో వర్క్..నో పే’ అని ప్రకటిస్తున్నాయి. వసతులు, విద్యా నైపుణ్యాలపై టాస్క్ఫోర్స్ కమిటీలు వేస్తే కళాశాలల లోటుపాట్లు బయట పడుతాయని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉమ్మడి జిల్లా బీఈడీ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనుండగా ఏ మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.
రామగిరి, అక్టోబర్ 31 : ప్రైవేటు బీఈడీ కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ‘పైకి సొంత భవనాలు దర్శనమిస్తున్నా.. లోపల అంతా డొల్లే’ అని ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు ఉండటం లేదని, క్వాలిఫైడ్ అధ్యాపకుల పేర్లు కేవలం రిజిస్టర్లకే పరిమితమయ్యాయని ఆరోపిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో తరగతుల నిర్వహణ లేకపోగా బోధనేతర సిబ్బంది అయినటువంటి క్లర్క్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. యాజమాన్యానికి విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహిస్తూ జేబులు నింపుకొంటున్నారని తెలుస్తున్నది. వాస్తవానికి యూనివర్సిటీ యంత్రాంగం ఏటా తనిఖీలు నిర్వహించి అఫిలియేషన్(గుర్తింపు) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, వసతులు
లేకపోయినా అనుమతులు వచ్చేస్తున్నాయి.
ఎంజీయూ పరిధిలో 33 కళాశాలలు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఈడీ కళాశాలలు 33 ఉన్నాయి. వీటిలో 2020-22 బ్యాచ్కి 29 కళాశాలల్లో అడ్మిషన్లు ఉండగా తరగతులు కొనసాగుతున్నాయి. కానీ, చాలా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉండడం లేదనేది బహిరంగ సత్యం. తనిఖీల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఎవ్వరూ ఉండడం లేదు. అన్నీ సక్రమంగా ఉంటేనే ‘టీఎస్ఎడ్సెట్’-2021కి అడ్మిషన్ల భర్తీకి ఆయా కళాశాలల వివరాలను యూనివర్సిటీకి పంపించాలి. కానీ, అలా జరుగడం లేదని తెలుస్తున్నది.
మూల్యాంకనం విధులకు అంతంతే హాజరు..
పేరుకు 33 కళాశాలలున్నా మూల్యాంకన సమయంలో అధ్యాపకుల కొరత వేధిస్తున్నది. 29 కళాశాలల్లో 340మందికి పైగా అధ్యాపకులు పనిచేస్తున్నట్లు జాబితా ఉన్నా మూల్యాంకనానికి 30నుంచి 35మంది మాత్రమే హాజరవుతున్నారు. పేరుకే రికార్డుల్లో ఉంటున్నారని, తరగతులు బోధించడం లేదని తెలుస్తున్నది. దాంతో మూల్యాంకన ప్రక్రియ సైతం అస్తవ్యస్తంగా తయారైంది.
డీఈఓల అనుమతి లేకుండానే టీచింగ్ ప్రాక్టీస్
బీఈడీ విద్యార్థుల టీచింగ్ ప్రాక్టీస్ కోసం డీఈఓ అనుమతి తప్పనిసరి. కానీ, గతంలో ఇచ్చిన పాఠశాలలకే పంపించి తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. టీచింగ్ ప్రాక్టీస్కు వెళ్లిన వారు పాఠశాలకు హాజరు కానప్పటికీ ప్రధానోపాధ్యాయులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది.
తనిఖీలు శూన్యం..
యూనివర్సిటీ అధికారుల నిఘా లోపమే బీఈడీ కళాశాలల అధ్వాన్న పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తరచూ బీఈడీ కళాశాలల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేశారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఇన్చార్జి వీసీ పాలనలో యాజమాన్యాలు తిరిగి అనుమతులు పొందాయి. ప్రస్తుత వీసీ విధుల్లో చేరి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్కసారి కూడా కళాశాలలను తనిఖీ చేయలేదని విద్యార్థి సంఘాల నాయకులు, అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఓ కళాశాల నుంచి అర్హత లేని వ్యక్తులను ప్రాక్టికల్స్ ఎగ్జామినర్గా పంపించినట్లు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మూల్యాంకనం విధులకు కళాశాలలు స్వయంగా అధ్యాపకులను పంపించాల్సి ఉండగా వర్సిటీ అధికారులు ఫోన్ చేసి అడుగాల్సిన పరిస్థితి దాపురించింది. లాక్డౌన్ అనంతరం తమను విధుల్లోకి తీసుకోవడం లేదని పలువురు అధ్యాపకులు వర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించినా సమస్యకు పరిష్కారం చూపకపోవడం ఉదాసీన వైఖరికి అద్దం పడుతున్నది. కొన్ని కళాశాలల్లో రిటైర్డ్ అయిన వారిని అతి తక్కువ వేతనానికి పనిచేయించుకుంటూ అర్హులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేపు ఎంజీయూలో సమావేశం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో నవంబర్ 2న ఎంజీయూలో సమావేశం జరుగనున్నది. మధ్యాహ్నం 3గంటలకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సెల్ పర్యవేక్షణలో నిర్వహించే సమావేశానికి వీసీ ప్రొ. సిహెచ్. గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. పి.విష్ణుదేవ్ హాజరు కానున్నట్లు సమాచారం.
నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
బీఈడీ కళాశాలల్లో ఎన్సీటీఈ, ఉన్నత విద్యామండలి నిబంధనలు అమలు చేయాలి. ప్రతి అధ్యాపకుడికీ కనీస వేతనాన్ని బ్యాంక్ ఖాతా ద్వారా ప్రతి నెలా అందించాలి. కొవిడ్ కాలానికి వేతనాలు చెల్లించాలి. విద్యార్థులు, అధ్యాపకుల హాజరుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలి. బీఈడీ విద్య ఎంతో విలువలతో కూడుకున్నది. దాన్ని అభాసుపాలు చేస్తే మొత్తం విద్యావ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నది.