రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలబడుతున్నది. సమైక్య పాలనలో నిర్వీర్యమై, కొందరి జేబులనే నింపిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో జవసత్వాలు నింపి, నిజమైన రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలంటే.. ప్రైవేట్లో లోన్లకు నానాపాట్లు పడాల్సిన పరిస్థితి. పట్టణంలో ఇల్లు లేదా శాశ్వత భవనాలు ఉన్నవారికే కమర్షియల్ బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తుంటాయి. ఈ కష్టాల నుంచి రైతు కుటుంబాలను గట్టెక్కించేందుకు డీసీసీబీ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. జిల్లా
సహకార బ్యాంకు వ్యవసాయ భూముల మీద పాతిక లక్షల వరకు లోన్లు అందించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విదేశీ విద్యను చేరువ చేస్తున్నది. అలా ఉమ్మడి జిల్లాలో ఐదేండ్లలో 210 మంది విద్యార్థులకు రూ.35కోట్ల రుణాలను అందించింది. సర్కారు సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో ఉన్నత విద్య అనంతరం ఉద్యోగాల్లో స్థిరపడి, రూ.50లక్షల నుంచి కోటి రూపాయల ప్యాకేజీ పొందుతున్న వాళ్లూ ఉన్నారు. తీసుకున్న రుణాలను అంతే బాధ్యతగా తిరిగి వడ్డీ సహా చెల్లిస్తున్నారని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.
నల్లగొండ, నవంబర్ 2 :సమైక్య పాలనలో డీసీసీబీ నిధులు లేక నీరసించి కనిపించేది. రెండు, మూడేండ్లకు ఒకసారి ప్రతి పీఏసీఎస్కూ రూ.నాలుగైదు లక్షల నిధులు మంజూరైతే డైరెక్టర్లే తమ అనుచరులకు లేదంటే బంధువులకు రుణాలు ఇప్పించుకునే వారు. అలాంటి శాఖ సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక టెస్కాబ్, నాబార్డు ద్వారా విరివిగా నిధులు సమకూర్చుకుని కళకళలాడుతున్నది. రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడంతో రైతు బిడ్డలు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి సైతం రుణాలు అందిస్తున్నది.
గ్రామీణ విద్యార్థ్దులకు ప్రతిభ ఉండి విదేశాల్లోని యూనివర్సిటీల్లో సీటు వచ్చినప్పటికీ డబ్బులు లేక ఆ విద్యకు దూరమవుతున్నారు. వాణిజ్య బ్యాంకులు పట్టణాల్లో ఇండ్లు లేదా ఇతర భవనాలు ఉంటే తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తున్నాయి. కానీ గ్రామాల్లో ఎంత భూమి ఉన్నప్పటికీ లోన్ ఇవ్వవు. అనేది అందరికీ తెలిసిన విషయం. గ్రామీణ విద్యార్థులకు విదేశీ విద్య అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2016 నుంచి సహకార బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. అందులో భాగంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 210 మంది విద్యార్థ్దులకు విద్యారుణాలు అందజేసింది. ఒక్కో విద్యార్థ్దికి రూ.10 నుంచి 25లక్షల వరకు మొత్తంగా ఇప్పటి వరకు రూ.35 కోట్లు అందజేశారు. 11 శాతం వడ్డీతో ఇస్తున్న ఈ రుణాలకు తొలి మూడేండ్లు వడ్డీ చెల్లించి తర్వాత ఐదేండ్ల కాలంలో ఐదు వాయిదాల పద్ధతిలో మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
వాణిజ్య బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ (విద్యా రుణం) కావాలని వెళ్తే పట్టణంలో ఆస్తులు చూపించాల్సి ఉంటుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ చూసి నెలల తరబడి తిరిగితే విచారణ చేసి రుణం మంజూరు చేస్తున్నది. డీసీసీబీకి విద్యా రుణం కోసం వెళ్తే గ్రామంలో భూమి ఉన్నప్పటికీ ఇవ్వడంతో పాటు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 11 శాతం వడ్డీతో అందజేస్తుంది. పైగా ఏ రుణం ఆలస్యమైనప్పటికీ విద్యా రుణాల విషయంలో పదిహేను రోజుల్లోనే అందజేస్తున్నారు. పట్టాదారు పాస్తు పుస్తకం చూసి ఒక సారి క్షేత్ర స్థ్దాయిలోకి వెళ్లి పరిశీలించి రుణం మంజూరు చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో 30 డీసీసీబీ బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీలు ఉండడంతో రుణం త్వరగా అందుతున్నది. ఎక్కడి వారికి అక్కడే ఈ రుణాలను అందజేస్తున్నారు. గతంలో ఎకరాకు రూ.2.5లక్షలు ఇవ్వగా తాజాగా ఆ రుణ పరిమితి రూ.5 లక్షలకు పెంచారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఐదేండ్ల కాలంలో 210 మంది విద్యా రుణాలు తీసుకోగా ఇప్పటికే అందులో సగం మంది దాకా చదువు పూర్తి చేసి ఆయా ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. ప్రధానంగా ఇక్కడ నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో కంప్యూటర్ సైన్స్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులకు వెళ్లారు. కొందరు విద్యార్థులు వెళ్లిన ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఉద్యోగాల్లో స్థిరపడినట్లు సహకార బ్యాంకు యంత్రాంగం చెబుతున్నది. ఒక్కో విద్యార్థ్ది ఏడాది రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు సంపాదించి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉద్యోగాల్లో స్థిర పడ్డ విద్యార్థులు ఒకటి రెండు వాయిదాల్లోనే తీసుకున్న రుణం చెల్లించినట్టు బ్యాంకు ఉద్యోగులు అంటున్నారు.
మా ఇద్దరు కొడుకులకు రుణం తీసుకున్నా..
మా పెద్ద బాబు పేరు కౌశిక్ రెడ్డి. అమెరికాలో మూడేండ్ల కింద కంప్యూటర్ సైన్స్లో సీటు వస్తే చేతిలో ఒక్క పైసా కూడా లేకుండె. ఏం చేయాలో అర్ధ్దం కాని పరిస్థ్దితి. నాకు పీఏసీఎస్లో సభ్యత్వం ఉన్నందున అందులో చదువు కోసం లోన్ ఇస్తారని తెలిసి బ్యాంకుకు వెళ్లి అడిగితే భూమి పెట్టమన్నరు. పెట్టిన పది రోజులకే రూ.18లక్షలు ఇచ్చిండ్రు. వాటితో మా బాబు అక్కడి వెళ్లి చదువు పూర్తి చేసి ఇప్పుడు ఫోర్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండు. ఏడాదికి రూ.75లక్షలు వస్తున్నయి. దీం తో మా రెండో బాబు గౌతమ్రెడ్డిని కూడా రూ.14 లక్షలు తీసుకొని కంప్యూటర్ సైన్స్ చదువు కోసం ఐర్లాండ్ పంపించాను.
15 రోజుల్లో లోన్ ఇచ్చిండ్రు
నేను పోలీస్ డిపార్ట్ మెంట్లో ఏఎస్ఐగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చేస్తున్నా. నాకు బ్యాంకులకు వెళ్లి తిరిగే సమయం లేదు. ఎస్బీ ఐకి వెళ్లి అడిగితే పట్టణంలో ఇల్లు అడిగిండ్రు. ఉంది అన్నాను కానీ టైం పడుతుంది అన్నారు. దాంతో మా స్నేహితుడి సలహాతో మునుగోడు డీసీసీబీ బ్యాంకుకు వెళ్తే 15 రోజుల్లోనే 18 లక్షలు ఇచ్చారు. పైగా రెండు సార్లు మాత్రమే బ్యాంకుకు వెళ్లాను. తర్వాత వాళ్లు పిలిచి చెక్కు ఇచ్చారు. ఇప్పుడు మా బాబు కెనడాలో ఉద్యోగం చేస్తుండు. ప్రస్తుతం ఏడాదికి రూ.60లక్షలు వస్తున్నాయి.