పీఆర్ఎల్ఐ, ఎంజీకేఎల్ఐ ఆధారంగా నిర్మాణం
3 టీఎంసీలతో ఉమామహేశ్వరం, 1.4 టీఎంసీలతో చెన్నకేశవుడి జలాశయం
మార్కండేయ రిజర్వాయర్కు రూ.84 కోట్లతో డీపీఆర్ సిద్ధం
70 వేల ఎకరాలకు సాగునీరు n సర్వేకు సీఎం కేసీఆర్ ఆదేశం
నాగర్కర్నూల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. పాలమూరు-రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుల ఆధారంగా అదనపు రిజర్వాయర్ల నిర్మాణానికి పూనుకున్నారు. ఈ మేరకు ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఇంజినీర్లతో జరిగిన సమీక్షలో ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఎంజీకేఎల్ఐ ద్వారా జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకుపైగా సాగునీరు అందుతున్నది. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, నాగర్కర్నూల్ (బిజినేపల్లి)లోని వట్టెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా, ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరు అందని ప్రాంతాల్లో అదనపు రిజర్వాయర్లను నిర్మించి సస్యశ్యామలం చేసే కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంజీకేఎల్ఐ ద్వారా కేవలం నాగర్కర్నూల్ నియోజకవర్గంలోనే దాదాపుగా 70 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే, బిజినేపల్లి మండలంలోని దాదాపు 17 గ్రామాల్లోని ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.
ఈ ప్రాంతాలకు సాగునీరు అందించేలా మార్కండేయ రిజర్వాయర్ నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారులు రూ.84 కోట్లతో డీపీఆర్ రూపొందించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇప్పటికే పరిపాలన అనుమతులపై ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పాదయాత్ర చేపట్టి సర్వే చేపట్టి సీఎంకు నివేదించారు. త్వరలో పరిపాలన అనుమతులు రానుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇక అచ్చంపేటలోని ఎత్తైన అమ్రాబాద్, పదర, మన్ననూరు వంటి ప్రాంతాలకు సాగునీరు అందించడం కత్తిమీద సామే. అలాంటి ప్రాంతాలకు సైతం సాగునీరు అందించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం విశేషం. విప్ గువ్వల బాలరాజు ఇంజినీర్లతో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీఎం అధికారులతో సమీక్ష తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదులలో నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించనున్నారు. ఇందులో భాగంగా రెండు రిజర్వాయర్లను నిర్మించేందుకుగానూ సర్వే పూర్తి చేసి నివేదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం ఏదుల నుంచి 22 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వి లింగాల మండలం జీలుగుపల్లి తండాలోని గుట్టల మధ్యకు తరలిస్తారు. అక్కడి నుంచి నీటిని నింపేందుకు బల్మూర్ మండలం మైలారం వద్ద మూడు టీఎంసీలతో మరో రిజర్వాయర్ నిర్మించనున్నారు. అక్కడి నుంచి అచ్చంపేట మండలం చంద్రసాగర్కు కాల్వ ద్వారా నీటిని తరలించేలా సంకల్పించారు. ఇక్కడి నుంచి అమ్రాబాద్ మం డలం మన్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయనున్నారు.
ఈ మూడు రిజర్వాయర్లకు అక్కడి ప్రాంతాల చారిత్రక నేపథ్యం అనుగుణంగా సీఎం కేసీఆరే స్వయంగా పేర్లు ప్రకటించారు. మైలారం వద్ద నిర్మించే లిఫ్ట్కు ఉమామహేశ్వరం, మన్ననూరులోని రిజర్వాయర్కు చెన్నకేశవుని పేర్లను పెట్టడం గమనార్హం. ఈ రిజర్వాయర్ల సర్వే పనులన్నీ వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లుగా ప్రకటించడం ఇక్కడి ప్రజలు, రైతన్నల్లో ఆనందాన్ని నింపుతున్నది. ఈ రిజర్వాయర్లు పూర్తయితే అచ్చంపేటలో 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. నల్లమల అటవీ ప్రాంతంలో తొలుత ఘాట్పై ఉన్న మన్ననూరుకు కృష్ణాజలాలు వస్తే అమ్రాబాద్, పదర వంటి ఎత్తయిన ప్రాంతాల్లో కృష్ణమ్మ సవ్వడి చేయనున్నది. దీంతో ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనున్నది. సీఎం కేసీఆర్ ప్రకటనతో నాగర్కర్నూల్, అచ్చంపేటలోని టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకాలతో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.