మాడ్రిడ్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో రష్యా, బెలారస్ ప్లేయర్ల ప్రాతినిధ్యంపై రగడ మొదలైంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు బెలారస్ ప్లేయర్లపై వింబుల్డన్ నిర్వాహకులు విధించిన నిషేధంపై నిరసన గళం వెల్లువెత్తుతున్నది. గ్రాండ్స్లామ్ టోర్నీ నుంచి రష్యా, బెలారస్కు చెందిన ఆటగాళ్లు బరిలోకి దిగకుండా సస్పెన్షన్ విధించడంపై టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, నోవాక్ జొకోవిచ్ తమ గళం విప్పారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ మద్దతుగా నిలిచారు.
ఉక్రెయిన్పై యుద్ధాన్ని కారణంగా చూపుతూ రష్యా, బెలారస్ దేశాల ప్లేయర్లకు నో ఎంట్రీ ఇవ్వడంపై మీడియా ముఖంగా వింబుల్డన్ నిర్వాహకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వీరిద్దరికి తోడు ఏటీపీ, డబ్ల్యూటీఏ..ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రతినిధుల వైఖరిపై పెదవి విరిచింది. నిషేధం నిర్ణయంతో రష్యాకు చెందిన ప్రపంచ నంబర్టూ ప్లేయర్ డానిల్ మెద్వదెవ్తో పాటు అండ్రె రుబ్లెవ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అనస్తియా పవ్లుచెంకోవా, విక్టోరియా అజరెంకా(బెలారస్) వింబుల్డన్లో ఆడేది అనుమానంగా మారింది. జూన్ 27 నుంచి మొదలవుతున్న వింబుల్డన్ టోర్నీలో రష్యా, బెలారస్ ప్లేయర్లను నిషేధం విధించడంపై నాదల్, జొకోవిచ్ స్పందించారు.
పక్కటెముకల గాయం నుంచి కోలుకుని ఆరు వారాల తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ మాట్లాడుతూ ‘రష్యా, బెలారస్ ప్లేయర్లపై సస్పెన్షన్ విధించడం సరైంది కాదు. యుద్ధంతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వారి చేసిన తప్పు కాదు. వారికి నేను క్షమాపణ చెబుతున్నాను. ప్రభుత్వ ఒత్తిడి మేరకు కాకుండా వింబుల్డన్ నిర్వాహకులు సొంత నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొద్ది వారాల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నిషేధంపై ప్లేయర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి’ అని అన్నాడు. ఇదిలా ఉంటే దిగ్గజ ప్లేయర్ల నిషేధంపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వింబుల్డన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.