హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ముందుగా ఆయన అగ్రిహబ్ ఇన్నోవేషన్ సెంటర్లో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ఉపకులపతి డాక్టర్ వీ ప్రవీణ్రావుతో కలిసి సమావేశమయ్యారు. తర్వాత వర్సిటీ పరిధిలోని మిల్టె ఇంకుబేషన్ సెంటర్, ఏఆర్ఐ క్యాంపస్లోని వరి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. వరి సెంటర్లో జరుగుతున్న పరిశోధనలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవల గురించి నాబార్డ్ చైర్మన్కు వీసీ వివరించారు. డ్రోన్ ద్వారా వరి వెదజల్లే పద్ధతి లైవ్ డెమాన్స్ట్రేషన్ను ఆయన తిలకించారు. పర్యటనలో తెలంగాణ ప్రాంత నాబార్డ్ సీజీఎం వైకే రావుతోపాటు పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్ జగదీశ్వర్ కూడా ఉన్నారు.
మహిళాసమాఖ్యల బలోపేతానికి చట్టాలు అవసరం
స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు ఇంకా బలోపేతం కాలేదని, ఈ దిశగా సరైన చట్టాలు రావాల్సిన అవసరమున్నదని నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల అన్నారు. సమాఖ్యలు బలోపేతం కాకపోవడానికి చట్టపరమైన అండదండలు లేకపోవడమే కారణమన్నారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఎస్హెచ్జీలు, ఎస్హెచ్జీల ఫెడరేషన్లపై విజన్-2030 అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్లో ఆత్మనిర్భర్ మహిళ కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు. 2030 నాటికి దేశంలో 45 కోట్ల మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరాలన్నారు. ప్రతి స్వయం సహాయక మహిళకు తలసరి అప్పు రూ.20 వేలు మాత్రమే ఉందని, దీనిని రూ.లక్షకు పైగా పెంచాలంటే సమాఖ్యలు సహకార లేదా కంపెనీ చట్టంలో నమోదు కావాలని ఆయన సూచించారు. సమావేశంలో పలు మహిళా సంఘాలు, సమాఖ్యలకు అవార్డులను అందించారు.