Na anveshana | సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా యూట్యూబర్ అన్వేష్ (‘నా అన్వేషణ’) ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అదృశ్యం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి అకౌంట్ కనిపించకపోవడంతో, ఇటీవల జరిగిన వివాదాల నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ అతనిపై బ్యాన్ విధించిందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నటి కరాటే కళ్యాణి తన ఫిర్యాదుతోనే అన్వేష్ అకౌంట్ తొలగించబడిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది. “పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్పై చర్యలు తీసుకున్నారు. ఇక ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ నా తదుపరి టార్గెట్” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే ఈ వివాదాల నడుమే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ కావడం ట్విస్ట్గా మారింది. తన ఖాతా తిరిగి ప్రారంభమైందని తెలియజేస్తూ అన్వేష్ ఓ పోస్టు పెట్టాడు.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అమెరికా కంపెనీలు కావడం వల్లనే నేను నిజాయితీగా బతకగలుగుతున్నాను. ఇవి భారత్లో ఉంటే రాజకీయాలకు బలైపోయేవాడిని. నేను సీతాదేవిని తిట్టినట్లు నిరూపిస్తే రూ.10 లక్షలు ఇస్తాను. నేను హిందువుగా పుట్టాను.. హిందువుగా చస్తాను. అన్ని మతాలకు గౌరవం ఇస్తాను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల మదనపల్లెలో జరిగిన ఏడేళ్ల బాలిక దుర్ఘటనపై వీడియో అప్లోడ్ చేసిన తరువాతే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తాత్కాలికంగా డీయాక్టివేట్ అయిందని అన్వేష్ వెల్లడించాడు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ప్రూఫ్ కోరిందని, పాత పాస్పోర్ట్ స్థానంలో కొత్త పాస్పోర్ట్ వివరాలు మూడుసార్లు సమర్పించానని తెలిపాడు. ఈ ప్రక్రియలో 48 గంటల పాటు అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందని వివరించాడు.
తాను హిందువునని, భారతీయుడినని, 130 దేశాలు తిరిగి కష్టపడి పనిచేశానని, ఎవరికీ అన్యాయం చేయలేదని స్పష్టం చేశాడు. పేదలకు రూ.80 లక్షలు దానం చేశానని, ప్రతిరోజూ ధర్మం పాటించే వ్యక్తిగా జీవిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కరాటే కళ్యాణి తన వల్లే అకౌంట్ తొలగించబడిందని చెప్పిన కొద్ది గంటలకే అకౌంట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ లేదా తాత్కాలిక సెన్సార్ కారణంగా జరిగిందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు కరాటే కళ్యాణి కూడా అన్వేష్ అకౌంట్ తిరిగి యాక్టివ్ అయ్యిందని అంగీకరిస్తూ పోస్ట్ చేసింది. అయినప్పటికీ “మళ్లీ బ్లాక్ చేయిస్తాం.. అతని పొగరు ఇంకా దిగలేదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి, ఈ ఘటనతో సోషల్ మీడియాలో మరోసారి సెలబ్రిటీ వివాదం హాట్ టాపిక్గా మారింది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.