కమ్మర్పల్లి/మెట్పల్లి, మార్చి 3: ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ వేదిక, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. అర్వింద్ ఇచ్చిన హామీని మరిచినందుకు రానున్న ఎన్నికల్లో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండు జిల్లాల ఐక్య వేదికల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పాదయాత్ర గురువారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ప్రారంభమైంది. సాయంత్రానికి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రానికి చేరుకొన్నది.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఐదు రోజుల్లో తెస్తానని, మద్దతు ధర కల్పిస్తామని మాట తప్పిన అర్వింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్కు తగిన గుణపాఠం చెప్పడానికి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తామని ప్రకటించారు. పాదయాత్రగా వచ్చిన రైతు నాయకులకు కమ్మర్పల్లి శివారులో రైతులు స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వీ ప్రభాకర్, దేగాం యాదాగౌడ్, జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి, నాయకులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాత్రి కమ్మర్పల్లిలో మీది వాడ కట్టు సంఘ భవనంలో బస చేసిన నాయకులు శుక్రవారం ఉదయం కమ్మర్పల్లి నుంచి ఆర్మూర్ వైపు పాదయత్రను కొనసాగించనున్నారు. పాదయాత్ర సందర్భంగా పోలీసులు బందోబస్తు కల్పించారు.