హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘దళితబంధు పథకానికి అడ్డొస్తే పడేసి తొక్కుతరు జాగ్రత్త’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంబేద్కర్ ఆలోచనా విధానంతో మానవతావాదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తుంటే, ఆ పవిత్ర కార్యాన్ని ఎత్తగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని, బండి సంజయ్ పిచ్చికుక్కలా మొరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్కి దమ్ముంటే.. మొనగాడే అయితే దళితబంధును బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలుచేయటానికి డప్పు మోగించాలని సవాల్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక అయిపోగానే దళితబంధు ఉండదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన దుర్మార్గుడు బండి సంజయ్ అని మండిపడ్డారు. హుజూరాబాద్తోపాటు వాసాలమర్రి, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధును అమలుచేయటం కోసం కోట్లాది రూపాయలు విడుదల చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 100 కుటుంబాల చొప్పు న ఎంపికచేసి, వారికి దళితబంధును అమలుచేసేందుకు వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని మోత్కుపల్లి గుర్తుచేశారు. తరతరాలుగా దళితజాతిపడిన కష్టాలను కడతేర్చేందుకు ముందుకుసాగుతున్న మహనీయుడు సీఎం కేసీఆర్పై ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే మర్యాద దక్కదని ఆయన హెచ్చరించారు. దళితబంధు తరువాత ఎస్టీ, బీసీ వర్గాలకు అద్భుతమైన పథకాలు తేవటంతోపాటు అగ్రవర్ణ పేదలకు కూడా ఇటువంటి పథకాన్ని తెస్తానని ప్రకటించిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, అటువంటి నాయకుడిపై బండి సంజయ్ సిగ్గులేకుండా నోరుపారేసుకోవటం దుర్మార్గమని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ను పాలించిన దళిత ముఖ్యమంత్రి మాయావతి సైతం దళితబంధు వంటి పథకం గురించి ఆలోచించలేదని అన్నారు. దళితబంధు పథకానికి తూట్లు పొడిచేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలను గందరగోళానికి గురిచేసేలా బండి సంజయ్ సహా ఎవరు వ్యవహరించినా గ్రామాల్లో అడుగుపెట్టనీయకుండా తరిమికొడతామని ఆయన స్పష్టంచేశారు. ‘సీఎంను జైలుకు పంపిస్తామంటున్న బండి సంజయ్ కేసీఆర్ను టచ్చేస్తే మాడి మసైపోతావు’ అని హెచ్చరించారు.
బీజేపీ మొదటి నుంచి దళితవర్గాలకు ద్రోహం చేస్తూనే ఉందని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతిఒక్కరికీ రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి మాటతప్పిన దేశద్రోహి నరేంద్రమోదీ అని మండిపడ్డారు. నీరవ్మోదీ, లలిత్మోదీ, విజయ్మాల్యా వంటి మోసగాళ్లను దేశం దాటించిన పాపం ప్రధాని మోదీదేనని దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయటమే కాకుండా లాభాల్లో నడిచే ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ పేద వర్గాల రిజర్వేషన్లు ఎత్తగొట్టిన దుర్మార్గమైన బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశంలోని నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించిన బీజేపీ ఇక్కడ మిలియన్ మార్చ్ చేపడతామని పేర్కొనటం ఆ పార్టీ సిగ్గులేనితనానికి నిదర్శమని ఎద్దేవా చేశారు. నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపించిన హంతక పార్టీ బీజేపీ అని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర కలయిక వల్లే హుజూరాబాద్లో ఈటల గెలిచాడని మోత్కుపల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రకు… కుక్కను నిలబెట్టినా 20 వేల ఓట్లు వస్తాయని, హుజూరాబాద్లో ఆ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గంపగుత్తగా కాంగ్రెస్ ఓట్లను ఈటల రాజేందర్కు అమ్ముకున్నాడని ఆరోపించారు. రేవంత్కు అవకాశం వస్తే సోనియా కుటుంబాన్ని కూడా అమ్మేస్తాడని అన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ సమూలంగా బొందపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగరపు ప్రసాద్, ముకుందరెడ్డి, సీ సుధాకర్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.