నీలగిరి, ఫిబ్రవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 74 వైద్య బృందాలు శుక్రవారం 9,236 మందికి పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 1,50,357 మందికి పరీక్షలు చేశారు. గ్రామాల్లో 61, పట్టణ ప్రాంతాల్లో 13 చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9,236 మందికి కంటి పరీక్షలు చేయ గా ఇందులో మొత్తం 4,512 పురుషులు,4,722 మంది స్త్రీలు, ఇతరులు 2 పాల్గొన్నారు. వీరిలో 40 ఏండ్లలోపు వారు 233, 40 ఏండ్ల పైబడిన వారు 1,198 కాగా వివిధ కారణాలున్న వారిని 6,959 మందిని గుర్తించారు.
యాదాద్రి భువనగిరిలో..
భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 63,635మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు తెలిపారు. ఇందులో 13,456 మందికి రీడింగ్ అద్దాలను అందజేశామని 9,449 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ చేశామన్నారు. శుక్రవారం 3,806 మందికి పరీక్షలు చేసి 570 మందికి రీడింగ్ కండ్లద్దాలు పంపిణీ చేయగా, 426మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేసినట్లు చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో లక్ష దాటిన కంటి పరీక్షలు
సూర్యాపేట : జిల్లాలో లక్ష మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కేంద్రాల్లో 1,00,467 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలో 51 బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 69 కేంద్రాల్లో కంటి వెలుగు పూర్తయింది.
కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగులో 6620 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1132 మందికి రీడింగ్ గ్లాస్లు అందించారు. మరో 456 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాస్లకోసం రెఫర్ చేశారు. 3007 మందికి మందులు అంజేసినట్లు పేర్కొన్నారు. 532 మందికి కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు.