హైదరాబాద్ : మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ( Board meeting) సోమవారం సచివాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్ట్పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని అధికారులకు ఆమె సూచించారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల(Advisory committees) ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఆర్డీసీఎల్ ఎండీ ఆమ్రపాలి ప్రాజెక్ట్ అంశాలను వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని ఆమె చెప్పారు. అనేక ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తెలిపారు.
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్సాగర్ డ్యామ్ డౌన్స్ట్రీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్సాగర్ డ్యామ్ డౌన్స్ట్రీమ్ పాయింట్ నుంచి బాపూఘాట్లో సంగమం పాయింట్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది.
నగరంలోని మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.