న్యూఢిల్లీ, నవంబర్ 29: కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కష్టాలేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం అంచనా వేసింది. ఒమిక్రాన్ కారణంగా గ్లోబల్ ఎకానమీకి కొత్త అనిశ్చితులు ఏర్పడవచ్చన్నది. అయితే దాని వ్యాప్తి, కేసులు, మరణాలు, వాక్సిన్ల ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది. ‘మచ్ టు లెర్న్ ఒమిక్రాన్ ఫాస్ట్’ పేరుతో ఓ విశ్లేషణను మూడీస్ విడుదల చేసింది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నదని, మరో రెండు వారాలు గడిస్తేగానీ వైరస్ ప్రభావంపై అంచనాకు రాలేమని మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ స్టీవ్ కొక్రేన్ అన్నారు.
టెల్కోలకు స్పెక్ట్రం దెబ్బ
ఆసియా-పసిఫిక్ దేశాల్లోని కొన్ని టెలికం సంస్థలకు మున్ముందు స్పెక్ట్రం బకాయిలు భారమయ్యే వీలున్నదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. స్పెక్ట్రం బకాయిలతో చైనా, భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని టెలికం సంస్థల రుణ భారం ఈ ఏడాది, వచ్చే ఏడాది 16 శాతానికిపైగా పెరుగవచ్చన్నది. 5జీ సేవల స్పెక్ట్రం కోసం భారతీ ఎయిర్టెల్ రూ.37,000 కోట్లదాకా ఖర్చు చేస్తున్నది.
ఒమిక్రాన్ ఉన్నా..
మరోవైపు ఒమిక్రాన్ వైరస్ భయాలున్నా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నొమురా తెలిపింది. నొమురా ఇండియా వారాంతపు బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్.. ఆదివారంతో ముగిసిన వారంలో 114.5గా నమోదైంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశలోనే వెళ్తున్నదని చెప్పింది. కాగా, ఒమిక్రాన్ ప్రభావం రవాణా వ్యవస్థపై ఎక్కువగా ఉండొచ్చని, దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం మరింత ఆలస్యం కావచ్చన్నది.
ఎకనామీపై సీఎఫ్వోల ఆశలు
ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని చాలామంది కార్పొరేట్ సీఎఫ్వోలు వ్యక్తం చేశారు. డెలాయిట్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈసారి 5-10 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని వివిధ రంగాలు, వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన దాదాపు 70 శాతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి-జూలై మధ్య వర్చువల్గా జరిగిన ఈ సర్వేలో దాదాపు 100కుపైగా సీఎఫ్వోలు పాల్గొన్నారు.