న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల శిరోమణి అకాలీదళ్ నిరసన తెలిపింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుకుంటున్నారని, ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని తాము కోరుకుంటున్నామన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఎంపీ, కేంద్ర మాజీమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల మాట ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు.
నేడు రైతులకు ఎవరు మద్దతిస్తున్నా.. రైతుల హక్కుల కోసం ఈ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సుమారు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు. కాగా, పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఆగస్ట్ 13 వరకు కొనసాగనున్నాయి. రైతుల నిరసనపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ గత నవంబర్ 26 నుంచి దేశ రాజధానికి సరిహద్దు నిరసన వ్యక్తం చేస్తున్నారు.