భద్రాచలం, ఆగస్టు 30: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అడ్డాగా చేసుకున్న ఎమ్మెల్యే పీఏ కల్యాణ్.. ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మరిన్ని లావాదేవీలు బయటికొస్తున్నాయి. కల్యాణ్తో సన్నిహితంగా ఉండే ఓ ఔట్ సోర్సింగ్ నాలుగో తరగతి ఉద్యోగికి సైతం ఈ ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి భద్రాచలంలో డివిజనల్స్థాయి కార్యాలయంలో పని చేస్తూనే ఆఫీసుకు వచ్చే భూ సమస్యలు, ఉద్యోగ సంబంధ దరఖాస్తుల వివరాలను కల్యాణ్కు చేరవేసినట్టు తెలుస్తున్నది.
ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకునే కల్యాణ్.. సంబంధిత వ్యక్తులను సంప్రదించి ‘ఎమ్మెల్యే సహకారంతో మీ సమస్యను పరిష్కరిస్తాను.. అందుకు ఆర్థిక సహకారం అందించాలి’ అని మాట్లాడేవాడనే ప్రచారం జరుగుతున్నది. భద్రాద్రి థర్మల్ పవర్స్టేషన్ (బీటీపీఎస్)కు సంబంధించిన ప్రతి సమాచారమూ సదరు ఉద్యోగి ద్వారానే చేరేదని ప్రచారం. ఈ నేపథ్యంలో సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి దుమ్ముగూడెం, టేకులపల్లి, పాల్వంచల్లో భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తున్నది. బినామీపేర్ల మీద ఓ పెట్రోలుబంక్ సైతం నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. పీఏ కల్యాణ్ వల్ల నష్టపోయిన బాధితుల్లో కొంతమంది ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారానే వెళ్లినట్టు తెలస్తున్నది. మరో రెగ్యులర్ ఉద్యోగి కూడా ఎమ్మెల్యే పీఏకు సన్నిహితంగా ఉంటూ ఉద్యోగుల, దరఖాస్తుదారుల సమాచారాలు, భూముల వ్యవహారాలు కల్యాణ్కు చేరవేసేవాడని తెలుస్తున్నది.
భద్రాచలం కాంగ్రెస్లో కల్లోలం..
ఇసుక సీనరేజీ స్కామ్లో కాంగ్రెస్కు చెందిన ఓ యువనేత బయటకు రాగా అతడిని పార్టీ నుంచి పక్కనబెట్టారు. రూ.20 కోట్లకు పైగా అప్పులు చేసి ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అయిన కాంట్రాక్టర్ భరత్ ఇటీవల జైలుకెళ్లాడు. తాజాగా ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలుచేసి పోలీసులకు చిక్కాడు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ తెల్లం వెంకట్రావు.. అనంతరం కాంగ్రెస్లో చేరడంతో సాధారణ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో ఉన్న పలువురు కాంగ్రెస్లోకి మారి తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు.
మొన్న కాంగ్రెస్ యువనేత.. నిన్న భరత్.. నేడు కల్యాణ్..
భద్రాచలం ఎమ్మెల్యే వెంటే తిరుగుతూ ఆయన పేరు చెప్పి అక్రమార్జనకు తెరలేపుతున్న వారికి కొదవలేదు. ఆరు నెలల క్రితం యువజన కాంగ్రెస్ నాయకుడు చర్ల మండలంలో ఇసుక రీచ్ల నిర్వాహకులను బెదిరించి నడిరోడ్డుపైనే కొట్టాడు. ఇసుక రీచ్లు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేయడంతో పలువురు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. ఈ విషయాన్ని ప్రజలు మరవక ముందే మరో కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ భరత్ తెరపైకి వచ్చాడు. ఎమ్మెల్యే వెంట తిరుగుతూ తనకున్న పలుకుబడిని ఉపయోగించి రూ.30 కోట్ల మేర అప్పులు చేసి కేరళకు పారిపోయాడు. కొత్తగూడెం పోలీసులు అతడిని వెతికిపట్టుకొచ్చి జైలుకు పంపారు. తాజాగా ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ రూ.10 కోట్లకు పైగా ఉద్యోగాల పేరుతో వసూలు చేసి కేసులపాలై పోలీసులకు లొంగిపోయాడు.