హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 30 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీవరకు గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ అనేలా దేశం నలుమూలలా ఈ ప్రాంత ప్రత్యేకతను చాటిచెప్పేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ప్రజాభవన్లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఆదివారం మంత్రి కొండాసురేఖతోపాటు దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు.
అధికారులు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను మంత్రికి వివరించారు. గోదావరి పరీవాహక ప్రాంత ంలో ఎంచుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ల పనులు ప్రారంభమయ్యాయని, ఐదు కి.మీ.మేర ఘాట్లను నిర్మించనున్నట్టు డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఏడీసీ శ్రీనివాసరావు, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.