కొండాపూర్, డిసెంబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్నగర్, అంజయ్యనగర్లలో స్థానిక కార్పొరేటర్ షేక్ మమీద్ పటేల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాల సమస్యలున్నాయని, వెంటనే పరిష్కరించాల్సిందిగా కాలనీ వాసులు వారి దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన విప్ గాంధీ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న సమస్యలను పరిశీలించి సమస్య పునరావృతమవ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రజా ఇబ్బందులను తొలగించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవిందర్ ముదిరాజ్, నాయకులు కృష్ణ గౌడ్, తిరుపతిరెడ్డి, రవిశంకర్ నాయక్, యాదయ్య గౌడ్, నరేశ్ ముదిరాజ్, చారి, సిద్ధిక్నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, కాలనీవాసులు నందు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.