బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ పేరు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులని తన నటనతో అలరించి వారి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు బిగ్ బీ. భారత సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన నటులలో అమితాబ్ కూడా ఒకరు. అత్యున్నత స్థానంలో ఉన్న అమితాబ్ గతంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారట. తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు గురించి ఓ లీడింగ్ పత్రికచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.
44 ఏళ్ల సినీ కెరీర్లో 1999 కాలం గడ్డు కాలంగా నిలిచింది. ఆ సమయంలో నేను స్థాపించిన వెంచర్ దారుణంగా విఫలం అయింది. ఈ కారణంగా 900 కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయింది. దాని వలన అనేక సమస్యలు. అప్పు వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడే వాళ్లు. బెదిరించారు కూడా. ఆ సమస్యలో చాలా మదన చెందాను. అసలు ఎలా బయటపడాలో తెలియలేదు.
ఓ సారి పరిస్థితులన్నింటిని సమీక్షించుకొని అప్పులన్ని తీర్చాలని డిసైడ్ అయ్యాను. అలా క్రమక్రమంగా తీర్చుకుంటూ వచ్చాను. దూరదర్శన్కు బకాయి పడ్డ మొత్తాన్ని కూడా చెల్లించాను. వడ్డీ చెల్లింపుల కోసం ఆ చానెల్లో కొన్ని ప్రకటనల్లో కనిపించాను. అప్పుఇచ్చిన వారిని, ఆ సమయంలో నాతో వారు ప్రవర్తించిన తీరుని ఎప్పటికీ మరచిపోను. ‘‘2000 సంవత్సరం నాకు బాగా కలసి వచ్చింది. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించింది.
నా ఇంటి వెనక ఉండే యశ్ చోప్రా దగ్గరకు వెళ్లి పని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఇచ్చిన అవకాశమే మొహబ్బతేన్. ఆ సినిమా రూపంలో అదృష్టం తిరిగి నా జీవితంలోకి ప్రవేశిచింది. ఆ తర్వాత నేను ప్రారంభించిన కౌన్ బనేగా కరోడ్పతి బాగా క్లిక్ అయ్యింది అని అమితాబ్ అన్నారు. ఆ సమయంలో అలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టే ఇప్పటికీ పని చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం చెహ్రే, ఝుండ్, బ్రహ్మస్త్ర, మేడే, గుడ్బై చిత్రాలతో నటిస్తున్నారు.