బన్సీలాల్పేట్ డిసెంబర్ 8 : పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని సకల వసతులతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దశలవారీగా ప్రారంభమవుతున్నాయి. లబ్ధిదారులను పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి పైసా ఖర్చులేకుండా అందజేస్తున్నారు. ఇందులో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ డివిజన్ బండమైసమ్మనగర్, చాచానెహ్రూనగర్ బస్తీలలో నిర్మించిన 574 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ నెల 17న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. బండమైసమ్మనగర్లో రూ.27.2 కోట్లతో 310 ఇండ్లు, చాచానెహ్రూనగర్లో రూ.20.64 కోట్లతో 264 ఇండ్ల నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా రెవెన్యూ, హౌజింగ్ శాఖల అధికారులు ప్రత్యేకంగా బస్తీ సభలను ఏర్పాటు చేసి అందరి సమక్షంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు.
ఇందిరానగర్లో లబ్ధిదారుల గుర్తింపు
పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. డబుల్ ఇండ్లను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, ఆర్డీఓ వసంత, తహసీల్దార్ అన్వర్తో కలిసి పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆర్డీఓ వసంత, కార్పొరేటర్ పి.విజయా రెడ్డితో కలిసి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.