బన్సీలాల్పేట్ : వక్ఫ్బోర్డు స్థలంలో పేద ముస్లీం కుటుంబాలకు రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్పేట్ డివిజన్లోని జీవైఆర్ కాంపౌండ్, పొట్టి శ్రీరాములు నగర్, బండమైసమ్మ నగర్ బస్తీలలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలలో ఆయన పర్యటించారు. వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, హైద్రాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారిలతో కలసి జీవైఆర్ కాంపౌండ్లో స్థలాన్ని పరిశీలించారు.
ముస్లీం శ్మశానవాటిక పక్కన ఉన్న కొంత స్థలం కేటాయిస్తే ఎన్నో ఏండ్ల నుండి నివసిస్తున్న 12 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేయాలనుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పడంతో వక్ఫ్బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ సలీమ్ తెలిపారు. అలాగే, ఆక్కడ ఆలయం నిర్మించే ప్రదేశంలో మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లలను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.
పొట్టి శ్రీరాములు నగర్లో మరికొందరు లబ్ధిదారుల ఆధారాలను పరిశీలించి, వాటిని దృవీకరించాక ఇండ్లను కేటాయింపు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బండమైసమ్మ నగర్ బస్తీలో మరో అదనపు బ్లాక్ నిర్మాణ పనులను పరిశీలించారు. దీపావళి లోగా ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాసిల్దార్ బాలశంకర్, కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ డిప్యూటి కమీషనర్ ముకుందరెడ్డి, హౌజింగ్ ఈఈ ఎం.వెంకట్దాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.