హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పాలమూరును పడావు పట్టించి వలసల జిల్లాగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కులేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు పచ్చబడుతుంటే ఓర్వలేక పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, అనేక త్యాగాలు చేసి, ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణను నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరులో 32 లక్షల ఎకరాల భూమి ఉంటే కాంగ్రెస్ హయాంలో కేవలం లక్షలోపే సాగైన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును నిర్మించేందుకు కాంగ్రెస్కు 36 ఏండ్లు పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. గులాబీ జెండా పట్టుకొని ఉద్యమించి తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి సహా 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మత్యాగానికి కారకులైన కాంగ్రెస్ నేతలు నేడు సిగ్గూఎగ్గూలేకుండా వారి పేరును వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిరుద్యోగ సైరన్ ఊదే నైతిక హక్కు రేవంత్కు లేదని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై 190 కేసులువేసి అడ్డుకున్న నాయకులా టీఆర్ఎస్ ప్రశ్నించేది అని నిలదీశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా త్వరలోనే పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉద్యోగ నియామకాలు, రాష్ట్రంలో చేసిన ఉద్యోగాల భర్తీ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. దేశంలో స్వల్పకాలంలోనే వివిధరంగాల్లో లక్షా 52 వేల ఉద్యోగాలను భర్తీచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టంచేశారు. త్వరలోనే మరో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని ఆంధ్రాకు తీసుకెళ్తుంటే ఆనాడు టీడీపీలో ఉండి మద్దతు ఇచ్చిన నేత రేవంత్రెడ్డికి మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చపడుతుంటే రేవంత్కండ్లు ఎర్రబడుతున్నాయని దుయ్యబట్టారు. ఇవ్వాళ పాలమూరుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వ్యవసాయ కూలీలు వలసలు వచ్చే పరిస్థితిని సృష్టించింది సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
రేవంత్కు బట్టలూడదీసే రోజు ఎంతో దూరంలో లేదు
రేవంత్రెడ్డి నీచాతి నీచంగా సంస్కార హీనంగా మాట్లాడితే బట్టలూడదీసి కొడతామని రేవంత్రెడ్డిని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. పాలమూరులో సభ పెట్టి ఎస్ జైపాల్రెడ్డి లాంటి వాళ్ల పేర్లనే చెప్పి పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుకు తోడ్పాటును అందించిన మహేంద్రనాథ్ను ఎందుకు గుర్తుచేయలేదని మండిపడ్డారు. సంపాదనే ధ్యేయంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తనకు దేశవిదేశాల నుంచి ఒక వర్గం నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నారని, వారి భరతం పడతామని హెచ్చరించారు.
-విప్ గువ్వల బాలరాజు
రేవంత్ది సర్కస్ సైరన్
రేవంత్ ఊదేది జంగ్ సైరన్ కాదని.. అది కేవలం సర్కస్ సైరన్ అని ఎంపీ పోతుగంటి రాములు దుయ్యబట్టారు. ఎన్ని ఎత్తులు వేసినా దేశంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్ర ఖతమైపోయిందని, ఆ పార్టీది ముగిసిన అధ్యాయమని చెప్పారు. 60 లక్షల మంది సైన్యమున్న టీఆర్ఎస్కు రాష్ట్రంలో ఎదురేలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత కాలం కాంగ్రెస్కు అధికారం పగటి కలేనని తేల్చిచెప్పారు.
-ఎంపీ రాములు