హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు విద్యార్థి గుగులోత్ మమతను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మమత తీసిన గిరిజన మహిళ చిత్రం ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్ ఇటాలియా’లో ప్రచురితం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం హైదరాబాద్ మంత్రుల నివాసంలో తన చాంబర్లో మమతకు మంత్రి సత్యవతి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ సోమనాథ్శర్మ, ఓఎస్డీ అశ్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.