మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 8: నూతన జోనల్ విధానంతో స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన జోనల్ ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు రూపొందించిన నేపద్యంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు సీఎం కేసీఆర్కు, మంత్రి మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని, భార్యాభర్తలు ఒక చోట పనిచేసే లా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు సేకరించిన తరువాత కేటాయింపులు జరుగుతాయన్నారు. ఉద్యోగుల సమస్య లు పరిష్కరించడంలో పూర్తి సహకారం ఉంటుందన్నా రు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లికి చెందిన లక్ష్మణ్కు రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి మల్లారెడ్డికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, నాయకులు వి.పెంటయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.