హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఐకియా స్టోర్లో జాత్యాహంకారం ప్రదర్శించటం చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని అంతర్జాతీయ ఐకియా స్టోర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన భార్య పట్ల స్టోర్ సిబ్బంది జాత్యహంకారాన్ని ప్రదర్శించారని జర్నలిస్టు నితిన్ సేఠీ ఐకియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘మణిపూర్కు చెందిన నా భార్యను ఆపి కొనుగోలు చేసిన వస్తువులను పరీక్షించారు. మా కంటే ముందు వెళ్లిన ఎవరినీ తనిఖీ చేయలేదు. ఈ జాత్యహంకార వివక్షకు మద్దతుగా సూపర్వైజర్, సిబ్బంది అంతా అక్కడికి వచ్చారు.
ఇదీ అంతర్జాతీయ స్టోర్ గొప్ప ప్రదర్శన..’ అని పోస్టు పెట్టారు. ‘నా భార్య షాపింగ్ చేసిన బ్యాగ్లను తనిఖీ చేసిన వ్యక్తి.. మీరు అన్ని కొనుగోలు చేశారంటూ అవహేళనగా నవ్వాడు. మమ్మల్ని ఎందుకు ఒంటరిగా ఉంచారనే దానికి మాత్రం సరైన సమాధానం రాలేదు. పైగా సూపర్వైజర్లు.. మీకు కావాలంటే పోలీసులను పిలవండి మేము మాట్లాడుతామని అన్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు.. మన ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం ఇది’ అని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పెద్దసంఖ్యలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ చర్య దుర్మార్గమైందని, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. వారికి క్షమాపణలు చెప్పాలని, కస్టమర్లందరినీ గౌరవించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలని, అవసరమైతే శిక్షణ ఇవ్వాలని సూచించారు. దీనిని త్వరగా చేస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఐకియా ఇండియా.. తమ స్టోర్లలో ‘సమానత్వం మానవహక్కు’ అని తాము విశ్వసిస్తామని తెలిపింది. అన్ని రకాల జాత్యహంకార, పక్షపాతాలను ఖండిస్తున్నామని పేర్కొన్నది. తప్పనిసరి బిల్లింగ్ ప్రొటోకాల్ను అనుసరించే క్రమంలో వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని సంస్థ ట్వీట్ చేసింది.
షారుక్ లాంటి వాళ్లకు సమాజంలో చోటు లేదు
‘తన ప్రపోజల్ను తిరస్కరించిందని ఝార్ఖండ్లోని దుమ్కాలో 12వ తరగతి చదువుతున్న బాలికకు నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన షారుక్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతరం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆ అమ్మాయి ఆగస్టు 28న మరణించినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రముఖ వార్తా సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్.. షారుక్లాంటి భయంకరమైన నేరస్థులకు పౌరసమాజంలో స్థానం లేదంటూ ట్వీట్ చేశారు. ‘అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఇలాంటి మృగాళ్లు చట్టాలలోని లొసుగులు ఉపయోగించుకొని తప్పించుకోకుండా/బయటికిరాకుండా మన ఐపీసీ, సీఆర్పీసీ, జువెనైల్ జస్టిస్ చట్టాలను సవరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన చట్టాలే నిరోధించగలవు’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.