హైదరాబాద్ జీనోమ్వ్యాలీలో ఏర్పాటు
బయోఫార్మాలో స్టార్టప్లకు ప్రోత్సాహం
పెట్టుబడులకు సిటీ అత్యుత్తమ గమ్యస్థానం
ఐటీ, లైఫ్ సైన్సెస్లో అగ్రగామిగా ఉన్నాం
పంచసూత్రాలతో ప్రపంచం భారత్వైపు
బయో ఏషియా సీఈవో కాంక్లేవ్లో కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బయోఫార్మా రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మెడ్టెక్, కాంప్లెక్స్ జెనరిక్స్, బయో జెనరిక్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్ తదితర రంగాల్లో లోతుగా పరిశోధనలు జరుగాల్సి ఉన్నదని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆర్ అండ్ డీతోపాటు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు జీనోమ్వ్యాలీలో ‘బీ హబ్’ (బయోఫార్మాస్యూటికల్ హబ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఇందులో ల్యాబ్లు, పరిశోధనలకు తగిన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మారంగానికి గమ్యస్థానంగా ఉన్నదని, బీ హబ్తో మరో మెట్టు ఎక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయోఏషియాలో భాగంగా బుధవారం నిర్వహించిన ‘సీఈవో కాంక్లేవ్’లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన పేర్కొన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని గుర్తుచేశారు. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో, పరిశోధనలను ప్రోత్సహించడంలో రాష్ట్రం ముందున్నదని స్పష్టం చేశారు.
హైదరాబాద్కు చెందిన ఇంకోజెన్ అనే సంస్థ ‘అంబ్రెలిసెన్’ పేరుతో మాలిక్యూల్ను అభివృద్ధి చేసిందని, దీనికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఐ) అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. దేశంలో సొంతగా ఔషధాన్ని అభివృద్ధి చేసి ఎఫ్డీఐ అనుమతులు పొందిన మొదటి సంస్థ ఇదేనని చెప్పారు. హైదరాబాద్లో అపార అవకాశాలు ఉన్నాయని.. ఒకసారి సందర్శించాలని ల్యూపిన్ ఎండీ నీలేశ్ గుప్తాను ఆహ్వానించారు. లైఫ్సైన్సెస్, ఐటీ రంగాలను అనుసంధానం చేయడం ద్వారా ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును ఔషధాల అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, డాటా ఎనాలసిస్ వంటి కీలక దశల్లో వినియోగిస్తే సమయం భారీగా కలిసి వస్తుందని చెప్పారు. దీంతో సొంత ఆవిష్కరణల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సదస్సులో పలువురు సీఈవోలు మాట్లాడారు.
‘డెస్టినేషన్ ఇండియా’కు కేటీఆర్ పంచ సూత్రాలు
భారత్ ఔషధాల ఉత్పత్తి కేంద్రంగా, వ్యాక్సిన్ హబ్గా ఎదిగిందని, ప్రపంచ ఔషధాల్లో 20 శాతం, వ్యాక్సిన్లలో 65 శాతం మన దగ్గరే ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చౌకైన, నాణ్యమైన ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఫార్మా రంగం ఆవిష్కరణల్లో వెనుకబడి ఉన్నామని తెలిపారు. దీనిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీపై పన్నుల భారాన్ని 200 శాతం నుంచి 100 శాతానికి తగ్గించిదని గుర్తుచేశారు. మరిన్ని పెట్టుబడులు రావాలన్నా.. మేధావులు వలస వెళ్లకుండా ఉండాలన్నా విధానాలు మారాల్సి ఉన్నదని చెప్పారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఐదు సూచనలు చేశారు. అవి..
1) ఒక ఔషధాన్ని ఆవిష్కరించాలంటే భారీగా నిధులు కావాలి. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉంచాలి.
2) దేశంలో పెట్టుబడులు పెరుగాలంటే కంపెనీలు కోరుకున్న విధంగా మౌలిక సదుపాయాలు (ప్లగ్ ఇన్ ప్లే ఇన్ఫ్రా) కల్పించాలి.
3) ఆర్ అండ్ డీ రంగాన్ని ప్రోత్సహించేలా, మేధోవలసలను అడ్డుకునేలా ప్రభుత్వం నూతన విధానాలు రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు పెంచాలి.
4) పరిశోధనలు ప్రారంభించడం నుంచి క్లినికల్ రిసెర్చ్, క్లినికల్ ట్రయల్స్.. ఇలా ఉత్పత్తి బయటికి వచ్చే వరకు అనేక రకాల అనుమతులు కావాలి. అనుమతులకు ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. తెలంగాణ ప్రభుత్వం గతంలోనూ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది.
5) ప్రసుత్తం దేశంలో ఆర్ అండ్ డీకి ఆరు శాతం నిధులు మాత్రమే వెచ్చిస్తున్నారు. వీటిని కనీసం 16 శాతానికి పెంచగలిగితే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. తద్వారా ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తాయి.
పరిశోధనలు పెరుగాలి
దేశంలోని ఫార్మా సంస్థలు పరిశోధనలపై దృష్టిసారించాలి. దీనికి ప్రైవేట్ రంగం నేతృత్వం వహించాలి. ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెక్టార్లో మరిన్ని పెట్టుబడులు రావాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మెడికల్ డివైజ్ పార్క్స్, డ్రగ్స్ పార్క్స్, ఫార్మా పార్క్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నాం. త్వరలో మరిన్ని చర్యలు తీసుకుంటాం.