అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్నది. నిన్న ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. ఆదివారం మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. నలుగురు ప్రొడ్యూసర్లో.. నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పని చేయదని.. కచ్చితంగా అందరి మేలు కోరి తీసుకుంటుందన్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు పెంచుకోవడాన్ని సమర్థించమని స్పష్టం చేశారు.
సినిమా రంగానికి చెందిన వాళ్లు.. ఎలాంటి సౌకర్యాలు కోరినా.. ప్రభుత్వం తరఫున అందించేందుకు సిద్ధంగా చెప్పారు. పవన్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ ఆ..హు.. అంటే.. అదిరి బెదిరిపోయే వాళ్లం కాదన్నారు. పవన్ సినిమా హిట్టయినా.. ఫెయిలైనా ప్రభుత్వానికి వచ్చేది.. పోయేదీ ఏమీ ఉండదన్నారు.