హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో గురువారం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్యనిష్ఠ, నిజాయితీని మార్గదర్శక సూత్రాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్సైజ్ శాఖ కేవలం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖ మాత్రమే కాదని, యువత వ్యసనాల బారిన పడకుండా కాపాడటం, సమాజాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించే అత్యంత కీలకమైన శాఖ అని మంత్రి స్పష్టంచేశారు.
డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా గంజాయి సాగు, అక్రమ సారా కేంద్రాలను గుర్తించడం, మొబైల్ యాప్స్, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అక్రమ రవాణాను పసిగట్టడం సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి చెప్పారు. మత్తుమూలాలను చిత్తు చేయడానికి ఏఐని వాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ సౌమ్య ధైర్యసాహసాలు కొత్త అధికారులకు స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు. శిక్షణలో ప్రతిభ కనబర్చి వారికి ఈ సందర్భంగా మంత్రి బహుమతులు అందజేశారు. అడిషనల్ కమిషనర్ ఖురేషీ, అకాడమీ డైరెక్టర్ సురేశ్, జాయింట్ కమిషనర్ అంజన్రావు, జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.