నిర్మల్ అర్బన్ : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నిర్మల్ పట్టణంలోని ప్రాంతాలను బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అధికారులు సందర్శించారు.వర్షాల కారణంగా ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. చెరువు ప్రాంతం కబ్జాకు గురి కావడంతో అలుగు పూర్తిగా మూసుకుపోవడంతో నీటిని బయటకు తరలించేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా లే అవుట్లను చేసి ప్లాట్లను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లను కొని ప్రజలు ఇబ్బందులు పడవద్దని తెలిపారు.
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పట్టణంలోని దివ్యనగర్ కాలనీలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను పరిశీలించారు.నీటిని బయటకు పంపి పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలోని నూతన మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు.
మిషన్ భగీరథ పనులు, రోడ్డు విస్తరణ, సుందరీకరణ, అంబేద్కర్ భవన నిర్మాణ పనులు వరదల కారణంగా నష్టపోయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీయస్ చైర్మన్ ధర్మాజీ రాజేంధర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు సంపంగి రవి, శ్రీకాంత్ తదితరులున్నారు.