ఇల్లందకుంట: మంత్రి హరీశ్రావు మాస్ లీడర్.. గరీబోళ్ల లీడర్.. టీఆర్ఎస్ ట్రబుల్షూటర్గా ఆయనకు పేరుంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కలిసినవారితో కలివిడిగా మాట్లాడుతూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలు వింటూ పరిష్కారమార్గాలు చూపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలతో సాధారణ వ్యక్తిలా కలిసి తింటూ.. టీ తాగుతూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు.
మంత్రి హరీశ్రావు సోమవారం ఇల్లందకుంట మండలం రాచపల్లి రాచపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్తూ మరివానిపల్లిలో ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగారు. కారు దిగి చకచకా హోటల్ దగ్గరికి వచ్చారు. అక్కడున్న వారితో కలిసి కూర్చొని దోస తిన్నారు. అనంతరం టిఫిన్ చాలా బాగుంది అంటూ హోటల్ యజమానిని మెచ్చుకున్నారు. ఈ చుట్టు పక్కల నీ హోటల్ ఫేమస్ అని విన్నా.. దావత్లకు కూడా నీ దగ్గరనే వండించుకపోతరట కదా..? అని యజమానితో మాట కలిపారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. మళ్లీ వచ్చి భోజనం కూడా చేస్తా అని మాట ఇచ్చారు. మంత్రి హరీశ్రావు పేరు వినడమేగానీ ఎప్పుడూ చూడలేదని, ఓ సాదాసీదా వ్యక్తిలా తన హోటల్లో టిఫిన్ చేయడం చూసి ఆశ్చర్యపోయానంటూ హోటల్ యజమాని అన్నారు. కుటుంబ సమేతంగా హరీశ్రావుతో సెల్ఫీ దిగి మురిసిపోయారు. అలాగే, కాన్వాయ్ ఆపి కారు దిగి వచ్చి కాకా హోటల్లో తమతో కలిసి హరీశ్రావు టిఫిన్ చేయడం ఆశ్చర్యంగా ఉందని, ఆయనతో కలిసి కూర్చోవడం ఆనందంగా ఉందని మరివానిపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు.