అంబర్పేట, డిసెంబర్ 23: దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళల విద్య, వికాసం కోసం ఎంతో క్రీయాశీలకంగా తన జీవితమంతా పనిచేసిన గొప్ప స్వాతంత్య్ర సమర పోరాట యోధురాలు అని, ఆమె స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ‘మదర్ ఆఫ్ సోషల్ సర్వీసెస్’గా కూడా ఆమె పేరు పొందారని చెప్పారు. విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఎస్ఆర్ కింద రూ.5 కోట్లతో నిర్మించిన నూతన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ భవనాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎం.ఇ.ఇ.ఎల్ డైరెక్టర్లు పి.సుధారెడ్డి, పి.రమారెడ్డి, రవిరెడ్డి, డీడీహెచ్ అండర్ ఆర్సీ చైర్మన్ ఎస్వీరావుతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
అనంతరం, మంత్రి మాట్లాడుతూ, దుర్గాబాయి దేశ్ముఖ్ లక్షలాది మంది పిల్లలకు ప్రధానంగా మహిళలకు విద్యనందించేందుకు ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశారని, వైద్యం అందించేందుకు కూడా కృషి చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో లేకుండా ఇక నుంచి నెలా లేదా రెండు నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దుర్గాబా యి దేశ్ముఖ్ దవాఖానను కూడా ఆయుస్మాన్ భారత్తో పాటు మరిన్ని సేవలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిచేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
కార్పొరేట్ దవాఖానలు లేని ఆ రోజుల్లో ఇంత పెద్ద దవాఖానను ఎంతో మంచి ఆశయంతో దుర్గాబాయి దేశ్ముఖ్ నెలకొల్పారని చెప్పారు. కొవిడ్ సెకండ్ వేవ్లో క్లిష్టమైన సమయంలో 12 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సమకూర్చారని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ర్టాలకు దాదాపు ప్రతిరోజు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ను ప్రభుత్వ దవాఖానలకు అందించి ఎంతో సహాయం చేశారన్నారు. ఎంత పెద్ద సంస్థ అయినా ఎంత డబ్బు సంపాదించినా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో దొరికిన ఆనందం వేరే దేంట్లో దొరకదన్నారు. కార్యక్రమంలో మాజీ జస్టిస్ ఏ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ వైవీ కృష్ణారావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, డీడీ హాస్సిటల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.